

హైదరాబాద్: భారత జట్టు మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నాడు. ఇటీవల భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కపిల్ దేవ్తో చర్చల అనంతరం జరుగుతున్న పరిణామాలను బట్టి మాజీ కెప్టెన్.. రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు 2014 సాధారణ ఎన్నికల్లోనూ కపిల్ దేవ్ను లోక్సభకు పోటీ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ, శిరోమణి అకాలీదళ్ సంప్రదించగా.. అప్పట్లో ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు.
కాగా, ఇటీవల భాజపా అధ్యక్షుడు అమిత్ షా 'సంపర్క్ ఫర్ సమర్థన్' పేరుతో దేశవ్యాప్తంగా పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా అమిత్ షా తాజాగా ఢిల్లీలో మాజీ క్రికెటర్ కపిల్దేవ్ను ఆ అతని భార్యను కలిశారు. ఈ క్రమంలోనే కపిల్దేవ్తో రాజ్యసభకు నామినేట్ చేసే అంశం గురించి ప్రస్తావించినట్లు సమాచారం.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకున్నా.. ఇటీవల రాజ్యసభలో నామినేట్డ్ సీట్లలో 12సీట్లకు గానూ 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రీడారంగం నుంచి కపిల్దేవ్ను రాష్ట్రపతి నామినేటెడ్ సీటుకు ప్రతిపాదించే ఆలోచనల్లో భాజపా ఉన్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు యూపీఏ ప్రభుత్వం తరఫున 2012లో క్రీడారంగం నుంచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కాగా పదవీ కాలం పూర్తి కావడంతో సచిన్ ఇటీవలే పదవీవిరమణ పొందారు. అయితే మొదటి నుంచీ రాజ్యసభ కార్యకలాపాలకు సరిగా హాజరు కాలేదంటూ సచిన్పై విమర్శలు వచ్చాయి. అయితే సచిన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. తన జీతభత్యాల కింద వచ్చిన రూ.90లక్షల వేతానాన్ని పీఎం సహాయనిధికి అందించారు.