న్యూఢిల్లీ : ఢిల్లీ వన్డే అర్థంతరంగా ఆగిపోయింది. పిచ్ సరిగ్గా లేదని లంక కెప్టెన్ సంగక్కర ఆరోపించడంతో వివాదాస్పద రీతిలో మ్యాచ్ నిలిచిపోయింది. సంగక్కర పిచ్ కండీషన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బ్యాట్స్ మన్స్ ను వెనక్కు రమ్మని సంతకేం ఇచ్చాడు. దీనితో క్రీజులో ఉన్న కండాంబి, పుష్పకుమార మైదానం వీడి డ్రెసింగ్ రూమ్ చేరుకున్నారు. కాసేపు ఏం జరుగుతోందో అర్థం కాకపోవడంతో ఫీల్డింగ్ చేస్తున్న టీమ్ ఇండియా జట్టు ఆటగాళ్ళతో పాటు ప్రేక్షకులు కూడా గందరగోళంలో పడిపోయారు. ఆ తర్వాత సంగక్కర పిచ్ కండీషన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలియడంతో ధోని టీమ్ మేనేజర్ ను సంప్రదించాడు. టీమ్ మేనేజర్ రిఫరీ వద్దకు వెళ్ళడంతో, శ్రీలంక జట్టు మేనేజర్ కూడా హాజరై తమ వాదన వినిపించారు. దీనితో రిఫరీ సమక్షంలో అంపైర్లు పిచ్ పరిశీలించారు. ఆ తర్వాత కూడా పిచ్ పరిస్థితిపై అంపైర్ల నిర్ణయం తెలుసుకోకుండానే, తాము ఆడేది లేదని సంగక్కర తేల్చి చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. పిచ్ చాలా దారుణంగా ఉందని, తమ ఆటగాళ్ళలో ముగ్గురికి గాయాలయ్యాయని సంగక్కర ఆరోపించాడు. పిచ్ పై బాల్ బౌన్స్ అవుతున్న తీరును సంగక్కర ఆక్షేపించినట్లు సమాచారం. దీనితో అంపైర్లు మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు. ఆట నిలిచిపోయే సరికి శ్రీలంక 23.3 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. తొలి బంతికే తరంగ జహీర్ ఖాన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత దిల్షాన్ (20), జయసూర్య (31), సంగక్కర (1), సమరవీర (2), వెనువెంటనే ఔటయ్యారు.