
కివీస్పై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టీ20 సిరీస్లో కూడా దుమ్ముదులపాలని చూస్తోంది. దీని కోసం రాంచీలోని జేఎస్సీఏ వేదికగా జరిగే తొలి టీ20తోనే శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల గైర్హాజరీలో మరోసారి ఈ ఫార్మాట్లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేయనున్నాడు.
ఈ మ్యాచ్లో టీమిండియాకు విధ్వంసర ఓపెనర్ పృథ్వీ షా ఓపెనింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడా? లేక ఇషాన్ కిషన్, గిల్ జోడీనే పాండ్యా కంటిన్యూ చేస్తాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. లేదంటే ఇద్దరినీ ఆడిస్తే కిషన్ను మూడో స్థానంలో పంపే అవకాశం కూడా కనిపిస్తోంది. అదే సమయంలో రాంచీలో సాయంత్రం 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఏమాత్రం లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. దీంతో ప్రేక్షకులు ఫుల్ మ్యాచ్ చూడటం గ్యారంటీగా కనిపిస్తోంది. అయితే సాయంత్రం మంచు ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక పిచ్ విషయానికి వస్తే.. రాంచీ స్టేడియంలోని పిచ్ ఎక్కువగా స్పిన్ బౌలర్లకు సహకరిస్తుంది. మ్యాచ్లో స్పిన్నర్లే కీలకం కానున్నారు. అంటే భారత్ తరఫున దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్లో ఎవరు ఆడితే వాళ్లు రాణించాల్సి ఉంటుంది. ఇక బ్యాటర్లు కూడా రాణించే అవకాశం ఇక్కడ ఉంది. చిట్టచివరగా ఇక్కడ జరిగిన టీ20 కూడా కివీస్, టీమిండియా మధ్యనే జరగడం గమనార్హం. ఆ మ్యాచ్లో న్యూజిల్యాండ్ను ఏకంగా 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఓడించింది.
భారత తుది జట్టు (అంచనా): శుభ్మన్ గిల్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి