
హైదరాబాద్: మరికొన్ని క్షణాల్లో భారత్లో ఓ చరిత్ర ఆవిష్కృతం కానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్ జరగబోతోంది. ఈ పింక్ బాల్ టెస్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోల్కతా అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది.
భారత్-బంగ్లా జట్ల మధ్య తొలిసారి జరగనున్న ఈ డే నైట్ టెస్టుకు ముఖ్య అతిథులుగా పశ్చిమ్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు హాజరవుతున్నారు. వీరిద్దరూ సంయుక్తంగా గంట మోగించి మ్యాచ్ని అధికారికంగా ప్రారంభిస్తారు. భారత్లో తొలిసారి డే నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానులు క్యూ కడుతున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఈ మ్యాచ్కి సంబంధించిన నాలుగు రోజుల టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయి. ప్లడ్ లైట్ల వెలుగులో పింక్ బాల్ ఎలా ప్రవర్తిస్తుందోనని ప్రతి ఒక్కరూ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. భారత కాలమానం ప్రకారం పింక్ బాల్ టెస్టు మధ్యాహ్నాం ఒంటి గంటకు మొదలవుతుంది.
తొలి సెషన్ 3 గంటలకు పూర్తవుతుంది. అనంతరం నలభై నిమిషాలు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ లంచ్ విరామ సమయంలో 'ఫ్యాబులెస్ ఫైవ్'తో ఓ టాక్ షోని క్యాబ్ ప్లాన్ చేసింది. 'ఫ్యాబులెస్ ఫైవ్' క్రికెటర్లు 2001లో ఇదే మైదానంలో ఆస్ట్రేలియాపై సాధించిన చారిత్రక విజయంపై మాట్లాడనున్నారు.
'ఫ్యాబులెస్ ఫైవ్' చాట్ షోను మైదానంలో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్లపై ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. ఆడియన్స్కు వీరి మాటలు స్పష్టంగా వినపడేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అవిశేక్ దాల్మియా తెలిపారు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆడిన క్రికెటర్లను సన్మానించనున్నారు.
ఈ జాబితాలో భారత్ నుంచి మాజీ ఆటగాళ్లు ఎస్. రమేశ్, సబా కరీమ్, సునీల్ జోషి, అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్, కపిల్దేవ్, దిలీప్ వెంగ్సర్కార్, అజహరుద్దీన్, శ్రీకాంత్, ఫరూక్ ఇంజినీర్, చందు బోర్డే ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి నైముర్ రహ్మాన్, మహ్మదుల్ హసన్, మహరబ్ హుస్సేన్, మొహమ్మద్ హాసీబుల్ హుస్సేన్, షాహ్రియర్ హొసేన్, కాజీ హబిబుల్ బషర్, మహ్మద్ అక్రమ్ ఖాన్ హాజరవుతున్నారు.
వీరితో పాటు భారత్లోని భారత క్రీడాకారులు అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, సానియా మీర్జాలను కూడా క్యాబ్ సన్మానించనుంది. 20 నిమిషాల టీ విరామంలో మాజీ కెప్టెన్లు మరియు ఇతర విభాగాలకు చెందిన క్రీడాకారులతో ఈడెన్ గార్డెన్స్లో గౌరవ పరేడ్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బౌండరీ లైన్ చుట్టూ బండ్లపై వీళ్లను తిప్పనున్నారు.