
ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్.. సరైన వెలుగు లేని కారణంగా ఆగిపోయింది. ఫ్లడ్ లైట్స్ వేసినా కూడా రెడ్ బాల్ను చూడటం కష్టంగా ఉండటంతో మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీనిపై అప్పట్లో తెగ చర్చ జరిగింది. అభిమానులు కూడా ఈ పరిస్థితిపై అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి సమస్య మరోసారి తలెత్తకుండా చెక్ పెట్టే పరిష్కారం తీసుకొచ్చామని డ్యూక్ కంపెనీ చెప్తోంది.
క్రికెట్ బాల్స్ తయారు చేసే ఈ సంస్థ.. తాజాగా ఒక పింక్ బాల్ను తయారు చేసిందట. సాధారణంగా డే/నైట్ టెస్టుల్లో పింక్ బాల్ వాడతారు. అయితే ఇది చాలా త్వరగా మెత్తబడిపోతోందనేది ఈ బంతులపై వచ్చే ప్రధాన విమర్శ. దీన్ని తాము అధిగమించామని, తాము కొత్తగా తయారు చేసిన బంతి 80 ఓవర్లు సులభంగా తట్టుకుంటుందని డ్యూక్ కంపెనీ తెలిపింది. దీంతో ఇకపై కేవలం డై/నైట్ టెస్టులే కాకుండా, సాధారణ టెస్టుల్లో కూడా తమ పింక్ బాల్స్ ఉపయోగించవచ్చని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ జజోడియా చెప్పాడు.
ఇలా పింక్ బాల్స్ వాడటం వల్ల వెలుతురు లేక మ్యాచులు ఆగే సమస్య ఉండదని జజోడియా వివరించాడు. అయితే తరతరాలుగా టెస్టుల్లో కేవలం రెడ్ బాల్స్ను మాత్రమే వాడుతున్నారు. టెస్టు క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో అన్ని దేశాల్లో ఇదే బంతిని వాడుతున్నారు. ఇప్పుడు సడెన్గా దీన్ని మార్చడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు. అయితే ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అని, ఇక్కడ డబ్బులు చెల్లించే ప్రేక్షకులకు సంతోషం కలిగించడం నిర్వాహకుల విధి అని జజోడియా అన్నారు. కాబట్టి ఆటలో అవసరమైన చిన్న చిన్న మార్పులు చేయడం తప్పదని స్పష్టం చేశారు. మరి ఇకపై టెస్టు మ్యాచులన్నీ పింక్ బాల్తోనే ఆడతారేమో చూడాలి.