న్యూఢిల్లీ: భారత క్రికెట్ మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో దుమ్మరేపుతున్నాడు. ఎవరికైనా చురుకైన సమాధానాలు ఇస్తున్నాడు. ఇటీవల భారత్ పైన నోటి దురుసు ప్రదర్శించిన బ్రిటిష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్కి తనదైన శైలిలో సెహ్వాగ్ చురకలంటించాడు.
సదరు జర్నలిస్ట్ మరోసారి ట్విట్టర్ వేదికగా సెహ్వాగ్కు పని చెప్పాడు. తాజాగా, పియర్స్ మోర్గాన్.. నేను రూ.10లక్షలు పందెం కాస్తానని, భారతదేశం మరో ఒలింపిక్ స్వర్ణం గెలిచేలోపు ఇంగ్లాండ్ ప్రపంచకప్ నెగ్గుతుందని, సవాల్కు సిద్ధమేనా అని ట్వీట్ చేశాడు.
దానికి సెహ్వాగ్ మాత్రం తనదైన శైలిలో కొందరిని దురదృష్టం మళ్లీ మళ్లీ వెంటాడుతూనే ఉంటుందని, వాళ్లు ఎంత ప్రయత్నించినా లాభం లేదంటూ.. హాహాహా.. అంటూ నవ్వులు కురిపించాడు.
అంతకుముందు, సదరు జర్నలిస్ట్ భారత్ పైన నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఇది దానికి కొనసాగింపు.
120 కోట్ల జనాభా ఉన్న దేశం రియో ఒలింపిక్స్లో రెండు పతకాలు (అవి కూడా స్వర్ణాలు కావు) వచ్చినందుకు అంతలా సంబరాలు చేసుకుంటోందని, సిగ్గు చేటు కదా అని పియర్స్ మోర్గాన్ తొలుత పేర్కొన్నాడు.

దానికి సమాధానంగా సెహ్వాగ్ మేం చిన్ని చిన్ని సంతోషాలను కూడా గొప్పగా జరుపుకొంటామని, కానీ క్రికెట్ను కనిపెట్టిన ఇంగ్లాండ్ ఇప్పటికీ ప్రపంచ కప్ నెగ్గలేకపోయిందని, అయితే ఇంకా ఆ దేశం క్రికెట్ ఆడుతుండటం సిగ్గుచేటు కదా అని రీట్వీట్ చేశాడు.