
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. సఫారీ పర్యటనకు క్రికెటర్లతో పాటు వారి భార్యలను కూడా తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెటర్లు మైదానంలో పోరాడుతుంటే వారి భార్యలు దక్షిణాఫ్రికాలో సేద తీరుతున్నారు.

అంతేకాదు వీలు దొరికినప్పుడల్లా దక్షిణాఫ్రికాలో చూడదగ్గ ప్రదేశాలను చూసేస్తున్నారు. తాజాగా రహానే, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్ భార్యలు లయన్ పార్కులో సింహాలతో దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దక్షిణాఫ్రికాలో ఎంతో ఫేమస్ అయిన లయన్ అండ్ సఫారీ పార్కును క్రికెటర్లు భార్యలు సందర్శించారు. ఈ సందర్భంగా సింహాలతో కలిసి దిగిన ఫొటోలను వారు తమ ఇన్స్టాగ్రామ్ల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 335 పరుగులు చేయగా.. భారత్ 307 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ టెస్టులో కెప్టెన్ కోహ్లీ సెంచరీ చేయడంతో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్ (50), డీన్ ఎల్గర్ (36) పరుగులతో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.