హైదరాబాద్: ఇంగ్లాండ్తో టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత లభించిన విరామాన్ని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ విహారయాత్రలో మునిగి తేలుతున్నాడు.
ఈ క్రమంలో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో విహరిస్తుండగా ఒక అభిమానికి వీరిద్దరూ దొరికిపోయారు. ఈ సందర్భంగా ఓ గుడి పూజారి వద్ద ఈ ఇద్దరు ఆశీస్సులు తీసుకుంటుండగా అభిమాని ఒకరు ఫొటో తీసి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అయితే ఈ ఫొటో ఎక్కడ, ఏ సందర్భంలో తీశారనే వివరాలు కచ్చితంగా తెలియరావడం లేదు. అయితే కొత్త సంవత్సరం వేడుకల్ని ఉత్తరాఖండ్లో ఈ జోడీ జరుపుకోనున్నారని మాత్రం ఈ ఫోటో ద్వారా అర్ధమవుతుంది. మరోవైపు ఉత్తరాఖండ్లో విహరిస్తున్న ఈ ప్రేమ పక్షులు ట్విట్టర్లో పెట్టిన పోస్టులు ఒకింత ఆసక్తి రేపుతున్నాయి.
ఆదివారం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జోలీ గ్రాంట్ విమానాశ్రయంలో జంటగా ప్రత్యక్షమైన కోహ్లీ, అనుష్క ఇక్కడే క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఇక క్రిస్టమస్ శుభాకాంక్షలు చెబుతూ మెడలో రుద్రాక్షమాల వేసుకుని ఓ సెల్ఫీ దిగి అభిమానుల కోసం ట్విట్టర్లో పోస్టు చేశాడు.