ముంబై: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఎంతో ప్రతిభ గల యువ ఆటగాడు మృతి చెందడం బాధ కలిగించిందని తెలిపాడు. అతని కుటుంబానికి, ప్రపంచ క్రికెట్కు చెడ్డ రోజు అని గంగులీ పేర్కొన్నాడు. ఇదొక ప్రస్తుత క్రికెట్లో గాయాలు మామూలే అని, బంతిని ఒంటికి తగిలించుకోని క్రికెటర్ ఎవరూ లేరని, ఇక ముందూ ఉండబోరన్నాడు సౌరవ్ గంగూలీ. అయితే హెల్మెట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని గంగూలీ సూచించాడు.
'క్రికెట్ సేఫ్ గేమ్ కానేకాదు. బంతి కఠినంగా ఉంటుంది. అది ఎక్కడైనా తగలొచ్చు. చంపొచ్చుకూడా. అలాంటి ఘటనలు ఇప్పుడే కాదు. గతంలో జరిగాయి' అని గంగూలీ తెలిపాడు. 'హెల్మెట్లు మెడ, భుజం భాగం కవర్ చేయలేవు. హుక్షాట్ ఆడే యత్నంలో ఏమాత్రం తేడావచ్చినా, బంతి మెడకు తాకుతుంది. హెల్మెట్లను మరింత రక్షణాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఐసీసీ చొరవచూపాలి' అని గంగూలీ అన్నాడు.

తొలిటెస్టుపై హ్యూస్ ఎఫెక్ట్: గవాస్కర్
న్యూఢిల్లీ: హ్యూస్ మృతితో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు రెండో ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. మరి.. డిసెంబర్ 4 నుంచి జరిగే తొలిటెస్టు (బ్రిస్బేన్) షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందో? లేదో? గానీ ఫిలిప్ హ్యూస్ విషాదాంతం భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలిటెస్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఈ నేపథ్యంలో తొలిటెస్టు కొనసాగించాలా? రద్దు చేయాలా? అనేది ఇరుజట్ల బోర్డులు నిర్ణయించుకోవాలని గవాస్కర్ అన్నాడు. 'తొలిటెస్టు కోసం మరో వారం సమయమున్నా, ఆ మ్యాచ్ కోసం ఇరుజట్ల ఆటగాళ్లు మానసికంగా సిద్ధంగా ఉండరని కచ్చితంగా చెప్పగలను' అని చెప్పాడు.
అయితే బ్రిస్బేన్ టెస్టు రద్దు చేయాలా? ఉంచాలా? అనేది బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియాలు నిర్ణయించుకోవాలని గవాస్కర్ అన్నాడు. హ్యూస్ మృతికి విచారం వ్యక్తం చేసిన గవాస్కర్.. బ్యాట్స్మెన్కు అత్యాధునిక రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో హ్యూస్కు ఇలా జరగడం దురదృష్టకరమన్నాడు.