మరో నెల రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి భారత జట్టును ప్రకటించడానికి మే 1వ తేదీనే తుది గడువు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో టీమిండియాను బీసీసీఐ ప్రకటించనుంది. అయితే భారత జట్టులోకి చోటు ఎవరికి దక్కుతుంది? ఎవరిపై వేటు పడుతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రెండు నెలల ముందు వరకు ప్రపంచకప్ జట్టులో శివమ్ దూబె, రింకూ సింగ్ తప్పక చోటు సంపాదించుకుంటారనే భావన అందరిలో కలిగింది. కానీ రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య రీఎంట్రీ ఇవ్వడంతో జట్టు కూర్పు ఆలోచన మారిపోయింది. మ్యాచ్ను ఒంటిచేత్తో మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న వికెట్ కీపర్ పంత్ లేకుండా భారత జట్టును ప్రకటించే సాహసాన్ని సెలక్టర్లు చేయలేరు. మరోవైపు ఫామ్లో లేకపోయినా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ను కాదనలేని పరిస్థితి తలెత్తింది.

దీంతో రింకూ సింగ్ స్థానంపై సందేహాలు మొదలయ్యాయి. రింకూకు సెలక్టర్లు మొండిచేయి చూపిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుక్ ఖాన్ భారత జట్టు ఎంపిక గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్కు రింకూ సింగ్ను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు. మెగాటోర్నీకి రింకూను ఎంపిక చేస్తే ఎంతో సంతోషిస్తాని షారుక్ చెప్పాడు.
రింకూ గురించి మాట్లాడుతూ.. ''అలాంటి అద్భుతమైన ప్లేయర్లు దేశం తరఫున ఆడుతున్నారు. రింకూ సింగ్ మరిన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అతను టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండాలి. కొందరు ఆటగాళ్లు దీనికి అర్హులు. రింకూ కచ్చితంగా జట్టులో ఉండాలని ఆశిస్తున్నా. అతను ఎంపికైతే అది నాకు అమితానందం. నాకు అది ఎంతో ఉన్నతమైన విషయం''
''వాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. కుర్రాళ్లు ఆడే సమయంలో నేను కూడా క్రీడాకారుడిగా అనుభూతి చెందుతుంటాను. ముఖ్యంగా రింకూ సింగ్, నితీశ్ రాణా వంటి ఆటగాళ్లులో నన్ను నేను చూసుకుంటాను. వాళ్లు మంచి ప్రదర్శన చేసినప్పుడు ఎంతో సంతోషిస్తుంటాను'' అని షారుక్ ఖాన్ అన్నాడు. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున రింకూ, నితీశ్ రాణా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.