న్యూఢిల్లీ: ఆటలో సామర్థ్యమే కీలకమని భారత క్రికెట్ టెస్టు టీమ్ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నారు. గురువారం నుంచి పాకిస్తానుతో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన బుధవారం ఆ మాట అన్నారు. ఫిరోజ్ షా కోట్లా మైదానం తనకు వ్యక్తిగతంగానే కాకుండా భారత్ కు కూడా అచ్చొచ్చిందని, అదే పునరావృతమవుతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ వారి వారి బాధ్యతలు తెలుసునని, అందరూ తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నానని, ఎవరు కూడా తమ స్థానాలు పదిలమని అనుకోవడానికి లేదని ఆయన అన్నారు.
ఆటగాడిగా తన పాత్ర మునుపటి మాదిరిగానే ఉంటుందని, వికెట్లు తీయడమే తన పని అని ఆయన అన్నారు. అందులో తేడా ఉంటుందని తాను అనుకోవడం లేదని, తాను ఒత్తిడికి కూడా గురి కావడం లేదని ఆయన అన్నారు. పిచ్ ఎలా ఉన్నదనే విషయం తాను ఆలోచించడం లేదని, తమ జట్టుకు విజయం సాధించే సత్తా ఉందని ఆయన అన్నారు. తాను వైస్ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో మాట్లాడానని, గత మూడు నెలలుగా వన్డేల విషయంలో ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నానని, అదెంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ సిరీస్ విజయం మాత్రమే తన లక్ష్యం కాదని, సీనియర్ గా భారత క్రికెట్ ను ముందుకు నడిపించడం కూడా తన లక్ష్యమని ఆయన అన్నారు.