హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీని ధోని వదులుకోవడాన్ని జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సమర్థించాడు. సరైన సమయంలో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించేందుకు విరాట్ కోహ్లి సిద్ధంగా ఉన్నాడని వెల్లడించాడు.
కెప్టెన్గా ఒక శకం ముగిసింది: ధోని సాధించిన విజయాలివే
మరికొంత కాలం క్రికెట్ ఆడే సత్తా ధోనికి ఉందని ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్తో జరిగే టీ20, వన్డేలకు జట్టు సభ్యుడిగా అందుబాటులో ఉంటానని తనతో చెప్పినట్లు వెల్లడించాడు. కెప్టెన్గా సాధించడానికి ధోనికి ఇంక ఏం మిగిలిందని ప్రశ్నించాడు.
'ఏడాది లేదా కనీసం ఆర్నెల్లు ముందుగా ధోని నిర్ణయం తీసుకొన్నాడంటే నేను ఆందోళన చెందేవాడిని. కానీ అతడు కచ్చితమైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు సెల్యూట్ చేస్తున్నాను. టెస్టులో విజయవంతమైన నాయకుడినని ఇప్పుడు నిరూపించుకొన్న కోహ్లీ గురించి అతడికి బాగా తెలుసు' అని అన్నాడు.
కెప్టెన్సీకి ధోని గుడ్ బై: ట్విట్టర్ కింగ్ సెహ్వాగ్ మౌనం, ఎందుకు?
'ధోని కెప్టెన్సీ వదులుకోవడం నూటికి నూరుపాళ్లు సరైన నిర్ణయం. భారత క్రికెట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అతడు ఈ నిర్ణయానికి వచ్చాడు. తన వారసుడు కోహ్లి అని ధోనికి తెలుసు. వికెట్ కీపర్, బ్యాట్స్ మన్గా మరి కొన్నేళ్లు జట్టుకు ధోని సేవలు అందించగలడు' అని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.
'అంతర్జాతీయ ట్రోఫీలైన టీ20, వన్డే ప్రపంచకప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఐపీఎల్ టైటిళ్లు, ఛాంపియన్స్ లీగ్ టీ20 అదనం. ఇంకా నిరూపించుకోవడానికి ఏం మిగల్లేదు. అతడొక గొప్ప నాయకుడు. ధోని ఉండడం తదుపరి కెప్టెన్ కోహ్లీకి మార్గదర్శకంగా నిలుస్తాడు' అని ఎమ్మెస్కే అన్నాడు.