
'మీ ఐపీఎల్లో డబ్బులు తప్ప మరేం ఉండవు.. అదే మా పీఎస్ఎల్లో అయితే సూపర్ క్రికెట్ ఉంటుంది' అని నిన్నమొన్నటి వరకు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ బీరాలు పోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థతి పూర్తిగా తలకిందులైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ గురించి చెప్పుకోవడానికి వాళ్ల దగ్గరే మంచి కంటెంట్ లేకుండా పోయింది. మ్యాచులు నిర్వహించడంలో స్థానిక ప్రభుత్వాలతో గొడవలు, డబ్బులు లేక ప్రభుత్వాల అవస్థలు మాత్రమే ఈ పీఎస్ఎల్ హైలైట్గా నిలిచాయి.
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో మునిగి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్లో పీఎస్ఎల్ మ్యాచులు నిర్వహించడమే పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో తాజాగా జరిగిన ఒక ఘటన మరింత సమస్యగా మారింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో పీఎస్ఎల్ మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఇక్కడ సీసీటీవీ కెమెరాలు అమర్చారు. అలాగే లైవ్ స్ట్రీమింగ్కు అవసరమైన సామగ్రి కూడా ఈ స్టేడియంలో ఉంచారు. అయితే ఈ విషయం తెలిసిన కొందరు ఈ సామగ్రిపై కన్నేశారు.
స్టేడియంలో సెక్యూరిటీ కోసం పెట్టిన ఎనిమిది సెక్యూరిటీ కెమెరాలను కొందరు దొంగలు దోచుకెళ్లారు. వీళ్లు వీటిని తీసుకెళ్లడం స్టేడియం బయట ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ కెమెరాలతోపాటు మ్యాచుల లైవ్ రికార్డింగ్, మానిటరింగ్ కోసం కావలసిన వస్తువులను కూడా ఈ దొంగలు ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. ఈ వస్తువులన్నీ కలిపి లక్షల ధర పలుకుతాయని స్టేడియం నిర్వాహకులు చెప్తున్నారు.
బయట ఉన్న సీసీకెమెరాల ఫుటేజి ఆధారంగా పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు నిందితులు ఎవరూ పోలీసులకు చిక్కకపోవడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న పీఎస్ఎల్ లీగులో సెక్యూరిటీ సమస్యలు చాలా సాధారణం అయిపోయాయి. దాదాపుగా మ్యాచులు జరుగుతున్న ప్రతి చోటా ఈ సమస్యలు తలెత్తుతుండటం గమనార్హం.