కోచ్ రమేశ్ పవార్ తనను అవమానించారంటూ
ఈ వివాదంపై మిథాలీ రాజ్ తొలిసారి లేఖ ద్వారా స్పందించారు. జట్టు కోచ్ రమేశ్ పవార్ తనను అవమానించారంటూ.. మిథాలీ లేఖ ద్వారా తన సందేశాన్ని బీసీసీఐకి పంపించారు. తనను జట్టు నుంచి తప్పించారని తెలిసి ఎంతో ఆవేదనకు గురైయ్యానని లేఖలో పేర్కొన్నారు.

ప్రపంచకప్ సాధించాలనే ఆశయంతో
‘భారత టీ-20 మహిళా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై ఎలాంటి ద్వేషం లేదు. జట్టు నుంచి నన్ను తప్పించాలని కోచ్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి నన్ను తప్పించింది. దేశం కోసం ప్రపంచకప్ సాధించాలనే ఆశయంతో ఉన్నా. కానీ ఆ బంగారం లాంటి అవకాశాన్ని నాకు కాకుండా చేశారు' అని తాను బీసీసీఐకి రాసిన లేఖలో మిథాలీ వివరించారు.

కొందరు కావాలనే కుట్ర పన్నారని
తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు వ్యక్తులు కావాలనే ఈ కుట్ర పన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనని జట్టు నుంచి తప్పించడాన్ని సమర్థించిన సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు. లేఖ ద్వారా వచ్చే పరిణామాలను సైతం ఇందులో పేర్కొన్నారు.

పవార్ దృష్టిలో విలువ లేదనే విషయం
జట్టు మేనేజర్ను కలవడంతో ఆయన అహం దెబ్బతిన్నట్టుంది. ఆస్ట్రేలియా మ్యాచ్కు ముందు సాయంత్రం జట్టు సమావేశం ముగిసిన తర్వాత పవార్ నా గదికి వచ్చారు. మీడియా దగ్గరకు రావొద్దని ఆదేశించారు. ' అని మిథాలీ వెల్లడించింది. జట్టులో ఉంటే మీడియా ఏం చేస్తుందో అర్థంకాలేదు. చాలా పెద్ద మ్యాచ్ జరుగుతున్నప్పుడు నా సొంత జట్టుతో నన్ను కలవొద్దని పొవార్ చెప్పాడు. నా 20 ఏళ్ల జీవితాన్ని జట్టుకు అంకితం చేశా.

లేఖ వల్ల హాని జరిగే అవకాశం
‘ఈ లేఖ వల్ల నాకు హాని జరిగే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న కొందరు నాశనం చేయాలనే ఈ కుట్ర పన్నారు. వాళ్లు తలుచుకుంటే.. నా కెరీర్ నాశనం అవుతుంది. అయినా సరే జరిగిన విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆమె సీఓఏ సభ్యురాలు.. నేనేమో ఓ సాధారణ ప్లేయర్ని. సెమీఫైనల్ మ్యాచ్కి ముందు వరుసగా 2 హాఫ్ సెంచరీలు చేశాను. అంతేకాక.. నాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా వచ్చాయి. అయినా నన్ను ఇలా పక్కన పెట్టి కేవలం ముగ్గురు మంచి బ్యాట్స్వుమెన్లతో సెమీఫైనల్ మ్యాచ్కి వెళ్లడం ఎంతో బాధకు గురి చేసింది' అని తన లేఖలో మిథాలీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications













