ముంబై: మహరాష్ట్రలో నెలకొన్న కరవు పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్లకు నీటిని ఉపయోగించకుండా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బాంబే హైకోర్టు విచారించింది. ప్రజల జీవనం కన్నా ఐపీఎల్ మ్యాచ్లే ఎక్కువా? అని క్రికెట్ బోర్డును ప్రశ్నించింది.
రాష్ట్రంలో కరవు తాండవిస్తున్న పరిస్థితుల్లో బాధ్యతారహితంగా నీళ్లను ఎలా వృథా చేస్తారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, మూడు స్టేడియాల్లో పిచ్ల నిర్వహణకు రోజుకు 60వేల లీటర్ల నీళ్లు అవసరమవుతాయని, మ్యాచ్లకు నీటిని వాడితే లీటరుకు రూ.వెయ్యి పన్ను చెల్లించేలా ఆదేశాలివ్వాలని 'లోక్సత్తా మూమెంట్'అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్లో పేర్కొంది.
ఐపీఎల్లో భాగంగా తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే మైదానంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్లో 20 మ్యాచ్లు ముంబై, పుణె, నాగ్పుర్లో జరగనున్నాయి. మే 29న ఫైనల్ మ్యాచ్ ముంబైలో జరుగనుంది. అయితే ఇప్పటికే టిక్కెట్ల అమ్మకం పూర్తయిందని, మ్యాచ్లను రద్దుచేస్తే భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని ముంబై క్రికెట్ అసోసియేషన్ మంగళవారమే హైకోర్టుకు తెలిపింది.
ఇదే అంశంపై కేతన్ తిరోద్కర్ అనే జర్నలిస్టు బాంబే హైకోర్టులో మరో పిల్ దాఖలు చేశారు. మ్యాచ్ల నిర్వహణకు వినియోగించే నీటికి ఐపీఎల్ కమిషనర్ నుంచి ట్యాక్స్ వసూలు చేయాలని పిల్లో పేర్కొన్నారు. మహరాష్ట్రలో గత రెండు దశాబ్దాలుగా కరవు ఉందని, ముంబై, విదర్భ, మరట్వాడాలలో ఈ పరిస్థితి ఎక్కువని పిల్లో తెలిపారు.
2015లో రాష్ట్ర వ్యాప్తంగా 3228 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇదే అంశాన్ని న్యాయస్థానం కూడా సుమోటోగా విచారణకు స్వీకరించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ అంశంపై న్యాయస్థానం మహరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, విదర్భ క్రికెట్ అసోసియేషన్, ప్రభుత్వం, పౌర సంఘాల ప్రతి స్పందనలను సైతం న్యాయస్థానం పరిశీలించింది. కాగా, మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్లు తరలించబోమని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఇప్పటికే స్పష్టం చేశారు.