
పూణే: శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భారత్ విధించిన 225 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ (0) మొదటి ఓవర్లోనే డకౌట్గా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన డేవిడ్ మలాన్ (46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68)తో కలిసి జోస్ బట్లర్ (34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) ఇన్నింగ్స్ను నిర్మించాడు.
భారీ షాట్లు ఆడుతూ మలాన్-బట్లర్ జోడి రెండో వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఈ క్రమంలోనే బట్లర్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రమాదకరంగా మారిన ఈ జోడిని కట్టడి చేసేందుకు భువనేశ్వర్ కుమార్ను రంగంలోకి దింపిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన భువనేశ్వర్.. ఆఫ్ స్టంప్కి చాలా వెలుపలగా బంతుల్ని వేస్తూ బట్లర్ని ఇబ్బందిపెట్టాడు. దాంతో ఒత్తిడికి గురైన బట్లర్.. ఆ ఓవర్లో ఐదో బంతిని లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యాకు చిక్కాడు.
తన వ్యూహం ఫలించడంతో విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. ఈ సంతోషంలో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ గట్టిగా అరించాడు. అయితే కోహ్లీ సంబరాలకు చికాకు పడ్డ బట్లర్.. ఆ వ్యాఖ్యలను తనకు ఆపాదించుకొని భారత కెప్టెన్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెవిలియన్కి వెళ్తున్న బట్లర్ వెనక్కి వచ్చి మరీ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ కలగజేసుకుని ఇద్దరికి సర్దిచెప్పాడు. ఆ తర్వాత కూడా కోహ్లీ తన వాదనని ఫీల్డ్ అంపైర్కి వినిపిస్తూ కనిపించాడు. అయితే ఫీల్డ్ అంపైర్లు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో మ్యాచ్ రిఫరీ ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోలేదు.
విరాట్ కోహ్లీ-జోస్ బట్లర్ మధ్య గొడవపై సోమవారం ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు. 'కోహ్లీ-బట్లర్ మధ్య ఏం జరిగిందో నాకు స్పష్టంగా తెలియదు. కానీ కోహ్లీ మ్యాచ్ ఆడేటప్పుడు చాలా ఎమోషనల్గా కనిపిస్తాడు. అతను కెప్టెన్ కూడా కావడంతో మ్యాచులో అతనికి పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్న నేపథ్యంలో కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ల్లో ఇలాంటి వాగ్వాదాలు సహజమే. అందుకు ఇదే ఓ చిన్న ఉదాహరణ' అని మోర్గాన్ అన్నాడు.
ఐపీఎల్ 2019 సీజన్లో జోస్ బట్లర్ని రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ చేయగా.. ఇప్పటికీ ఇద్దరి మధ్య ఓ చిన్నపాటి యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు అశ్విన్కు తోడు విరాట్ కోహ్లీ జత అయ్యాడు. ఈ వాగ్వాదం ఇంతటితో ఆగుతుందా? లేక వన్డే సిరీస్లో కూడా కొనసాగుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా ఇలానే జరిగితే.. ఐపీఎల్లో కూడా వీరి మధ్య గొడవలుంటాయని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే కోహ్లీ, బెన్ స్టోక్స్ మధ్య గత కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.