భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య చాలా గొడవల తర్వాత ఆసియా కప్ 2023 నిర్వహణకు అన్ని మార్గాలు క్లియర్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త చీఫ్ జకా అఫ్రాఫ్ చేతుల మీదుగా ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. లాహోర్లో బుధవారం సాయంత్రం 7.45 గంటలకు ఆసియా కప్ షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది.
ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్కు దక్కడంతో.. రెండు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా తమ జట్టును పాక్కు పంపలేమని బీసీసీఐ తేల్చిచెప్పింది. దీంతో ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చాలా రోజులపాటు వాతావరణం వేడెక్కింది. అయితే చివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్కు అందరూ అంగీకరించారు. ఈ మోడల్లో కేవలం నాలుగు మ్యాచులే పాక్లో జరుగుతాయి. మిగతా 9 మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇటీవల పీసీబీ కొత్త చీఫ్గా ఎన్నికైనా జాకా అష్రాఫ్ కూడా తను పదవి చేపట్టేముందు ఈ హైబ్రీడ్ మోడల్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో మళ్లీ ఆసియా కప్ జరగదేమో? అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే అలాంటిదేం లేదని, పీసీబీ ఒప్పేసుకున్న తర్వాత తాను ఏం చేయలేనని అఫ్రాఫ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ టీమ్స్ పోటీ పడతాయి.
భారత్, పాకిస్తాన్ జట్లు రెండుసార్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచులను శ్రీలంకలోని డంబుల్లాలో నిర్వహించనున్నారట. ఈ వేదికలో భారత టీం రికార్డు అంత గొప్పగా లేదు. ఈ ఏడాది జరిగే ఆసియా కప్లో జట్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. ఈ రెండు గ్రూపుల్లో టాప్లో నిలిచిన రెండు టీమ్స్.. సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తాయి. ఈ స్టేజ్లో టాప్- జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.