పాకిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్.. గత ఆరు నెలల నుంచి తన ఇంగ్లీష్ భాషపై ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉన్నాడు. బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ మీమర్స్ కు స్టఫ్ గా మారాడు. సోషల్ మీడియాలో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా తన ఇంగ్లీష్ భాషపై సోషల్ మీడియాలో వస్తోన్న ట్రోలింగ్పై స్పందించాడు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్. భావోద్వేగానికి కూడా గురయ్యాడు.
అది మాత్రమే కోరుకుంటున్నారు...
పీసీబీ, తన దేశం.. తన నుంచి నాణ్యమైన క్రికెట్ను మాత్రమే కోరుకుంటుందని అన్నాడు మహమ్మద్ రిజ్వాన్. ఇంగ్లీష్ కాదని పేర్కొన్నాడు. తనకు వచ్చిన భాషలోనే, నచ్చినట్టు మాట్లాడుతానని.. ఎవరేమనుకున్నా పట్టించుకోనని అన్నాడు. తన పని పాకిస్థాన్ కోసం నాణ్యమైన క్రికెట్ ఆడటమేనని, మంచిగా ఇంగ్లీష్ మాట్లాడటం కాదని వెల్లడించాడు.

ఇప్పటికీ బాధపడుతున్నా...
"పీసీబీ నా నుంచి క్రికెట్ కోరకుంటోంది. ఇంగ్లీష్ కాదు. ఒకవేళ ఇంగ్లీష్ కావాలంటే, నేను క్రికెట్ వదిలేసి ప్రొఫెసర్ అవుతాను. కానీ ఇప్పుడు నాకు అంత టైమ్ లేదు. అయితే నేను నా చదువును పూర్తి చేసుకోలేకపోయాను. ఇప్పటికీ దాని గురించి బాధపడుతుంటాను. అందుకే ఇంగ్లీష్ మాట్లాడడంతో ఇబ్బంది పడుతుంటాను. నా జూనియర్స్ కు కూడా చదువును పూర్తి చేయండి అని చెబుతుంటాను. అప్పుడు వాళ్లు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు." అని రిజ్వాన్ అన్నాడు.
అయినా సిగ్గుపడను..
"అయినా నా గురించి ఎవరేమన్నా అస్సలు పట్టించుకోను. నేనొక విషయంలో గర్వంగా ఫీలవుతా. ఏం మాట్లాడినా అది నా మనసులో నుంచే వస్తుంది. నాకు ఇంగ్లిష్ అంతగా తెలీదు. నేను సరిగ్గా, సరైన చదువును పూర్తి చేయలేదని ఇప్పటికీ బాధపడుతుంటాను. కానీ పాకిస్థాన్ కెప్టెన్గా రాణిస్తూ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నానని ఒక్క శాతం కూడా సిగ్గు పడను." అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.