
బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ చైర్మన్ జై షాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నయా చీఫ్ నజాం సేథీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్ గురించి చర్చించేందుకు తాము ఎన్నిసార్లు ప్రయత్నించినా జై షా నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదని చెప్పాడు. తాము ఇప్పటికే రెండు, మూడు మెయిల్స్ పంపామని, కానీ ఒక్క దానికి కూడా జై షా వైపు నుంచి సమాధానమే లేకుండా పోయిందని వాపోయాడు.
'మా వైపు నుంచి ఆయన్ను కలిసేందుకు రెండు, మూడు సార్లు ప్రయత్నించాం. మా మాజీ సీఈవో ఫైజల్ హస్నయిన్ కూడా మెయిల్స్ పంపాడు. ఒక వేళ జై షా కనుక దుబాయ్లో ఉంటే నేనే వెళ్లి కలుద్దామని అనుకున్నా. కానీ జై షా నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం బాధాకరం. రెండు, మూడు మెయిల్స్ పంపిన తర్వాత కనీసం మర్యాదపూర్వకంగా అయినా చిన్న సమాధానం పంపాల్సి ఉంటుంది. జై షాను కలవాలని నాకూ ఉంది. అంతకుముందు అనురాగ్ ఠాకూర్ తదితర బీసీసీఐ అధికారులతో నాకు చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి' అని వివరించాడు.
అలాగే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తరఫున ఈ ఏడాదిలో ఉన్న కీలకమైన క్రికెట్ టర్నీల వివరాలను తాజాగా జై షా వెల్లడించారు. వీటికి సంబంధించిన గ్రాఫ్ను తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశాడు. దీనిపై కూడా నజాం సేథీ అక్కసు వెళ్లగక్కాడు. జై షా విడుదల చేసిన గ్రాఫ్లో ఆసియా కప్ కూడా ఉంది. 'ఆసియా కప్ ఆతిథ్యం ఇచ్చే మమ్మన్ని కనీసం మాట కూడా అడగకుండా వాటిని సెట్ చేయడం నిజంగా గొప్ప విషయం. మా దగ్గర జరిగే పీఎస్ఎల్కు కూడా షెడ్యూల్ కూడా మీరే తయారు చేయొచ్చు కదా' అంటూ జోకులు పేల్చాడు.