హైదరాబాద్: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినందుకు గాను ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఇర్ఫాన్పై పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు అతడికి బోర్డు 14 రోజుల గడువు ఇచ్చింది. ఇర్ఫాన్ కేసులో తమ విచారణ కొనసాగుతుందని పీసీబీ స్పష్టంచేసింది.
పీఎస్ఎల్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఇర్ఫాన్పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడిపై ఈ నెల మొదటి వారంలో పీబీసీ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో అతడు బుకీని కలవడంతో పాటు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు రుజువు కావడంతో పీసీబీ అతడిపై వేటు వేసింది. పీఎస్ఎల్ సందర్భంగా తనను ఓ బుకీ కలిసినా ఆ విషయాన్ని ఇర్ఫాన్ పీసీబీకి వెల్లడించలేదు.
ఇది తమ కోడ్లోని ఆర్టికల్ 2.4.4ను ఉల్లంఘించడమే అవుతుందని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్టికల్ ప్రకారం ఎవరైనా అవినీతికి పాల్పడాల్సిందిగా ఓ క్రికెటర్ను కలిస్తే ఆ విషయాన్ని వెంటనే పీసీబీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి తెలియజేయాల్సి ఉంటుంది.
ఈ సస్పెన్షన్ సమయంలో ఇర్ఫాన్... క్రికెట్కు సంబంధించి ఏ ఒక్క ఫార్మాట్లో కూడా ఆడేందుకు అనుమతింపబోమని పీబీసీ స్పష్టం చేసింది. దీంతో పాటు క్రికెట్ బోర్డు నుంచి ఇర్ఫాన్ చార్జిషీటు కూడా అందుకున్నాడు. కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను ఇర్ఫాన్ ఉల్లంఘించాడని పీబీసీ పేర్కొంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఇర్ఫాన్ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత పొడవైన క్రికెటర్గా మొహమ్మద్ ఇర్ఫాన్ గుర్తింపు పొందాడు. పాకిస్థాన్ తరుపున 4 టెస్టులు, 60 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.
అయితే ఈ మధ్యే తన తల్లిదండ్రులు చనిపోయారని, ఆ బాధలో ఉన్న కారణంగా తాను ఈ విషయాన్ని పీసీబీకి వెల్లడించలేకపోయానని ఇర్ఫాన్ చెబుతున్నాడు. అంతకముందు పాకిస్థాన్ సూపర్ లీగ్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు ఆరోపణలపై మరో ఇద్దరు క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ సస్పెండ్ అయ్యారు. దీనిపై పీసీబీ విచారణకు ఆదేశించింది.
ఫిక్సింగ్ కేసులోనే మరో పాక్ క్రికెటర్ నసీర్ జంషెడ్ అరెస్టయ్యాడు. గతంలో పాక్ అంతర్జాతీయ క్రికెటర్లు మహ్మద్ ఆమీర్, సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్లు ఫిక్సింగ్ కేసులో సస్పెండ్ కావడంతో పాటు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే.