
లాహోర్: త్వరలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ను తటస్థ వేదికకు మార్చడానికి శ్రీలంక చేసిన విన్నపాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తిరస్కరించింది. పాకిస్తాన్లో అంతర్జాతీయ క్రికెట్కు పూర్వవైభవం తీసుకురావాలనే వారి ప్రణాళికలు ప్రమాదంలో పడుతాయని పీసీబీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలలో లంక జట్టు పాక్లో వన్డే, టీ20 సిరీస్ కోసం పర్యటించాల్సి ఉంది. ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లను కరాచీ, లాహోర్లో ఆడాల్సి ఉంది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకూ ఇరు జట్ల మధ్య సిరీస్ జరగాల్సి ఉంది.
అయితే భద్రతా కారణాల రీత్యా లంక కెప్టెన్లు దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగ.. ఏంజిలో మాథ్యూస్ లాంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు మొత్తం 10 మంది పాక్ పర్యటనను నిరాకరించారు. అనేక పరిమాణాల అనంతరం.. పాకిస్తాన్లో జరగాల్సిన మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహిస్తే బాగుంటుందని శ్రీలంక క్రికెట్ బోర్డు పీసీబీకి విన్నవించుకుంది. తాజాగా లంక విన్నపాన్ని పీసీబీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ను మార్చబోమని స్పష్టం చేసింది.
స్వదేశీ సిరీస్ను తటస్థ వేదికపై నిర్వహించే ప్రశ్నే లేదని పీసీబీకి చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. 'అంతర్జాతీయ క్రికెట్ను తిరిగి పాకిస్తాన్కు తీసుకురావాలని భావిస్తున్న సమయంలో తటస్థ వేదికలో మ్యాచులను నిర్వహిస్తే ప్రయోజనం ఉండదు. ఒకవేళ శ్రీలంకతో సిరీస్ను తటస్థ వేదికపై నిర్వహించడానికి ఒప్పుకుంటే.. మిగతా జట్లను పాకిస్తాన్కు తీసుకు రావడం కష్టంగా మారుతుంది. త్వరలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆరంభం కానున్న తరుణంలో.. ఒక ద్వైపాక్షిక సిరీస్కు వేదికను మారిస్తే దేశంలో భద్రతపై మరింత ఆందోళన వ్యక్తమవుతుంది' అని సదరు పీసీబీ అధికారి పేర్కొన్నారు.
పాకిస్థాన్ పర్యటనకు శ్రీలంక క్రికెట్ బోర్డు బుధవారం జట్టుని ప్రకటించింది. భద్రతా కారణాలు దృష్ట్యా ఈ సిరిస్లో పాల్గొనేందుకు పలువురు సీనియర్ క్రికెటర్లు నిరాకరించడంతో.. ఆ పది మంది ఆటగాళ్లకు బోర్డు జట్టులో చోటు కల్పించలేదు. ఈ పర్యటనలో వన్డే సిరిస్కు కెప్టెన్గా లాహిరు తిరిమన్నేని నియమించగా.. టీ20లకు కెప్టెన్గా దాసున్ షణకాను నియమించింది.