పాకిస్తాన్ క్రికెట్లో కొత్త మార్పులు తీసుకురావాలని తీసుకున్న నిర్ణయాన్ని 24 గంటల్లోనే వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. పాక్ మాజీ దిగ్గజం సల్మాన్ బట్ను సెలెక్షన్ ప్యానెల్లోకి తీసుకుంటున్నట్లు పాక్ నయా చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు గుప్పించారు.
బట్పై గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిపై కొంత కాలం నిషేధం కూడా విధించారు. ఇలాంటి ప్లేయర్ను సెలెక్షన్ ప్యానెల్లోకి ఎలా తీసుకుంటారని విమర్శలు వచ్చాయి. ఈ కారణంగానే బట్ను ప్యానెల్లో నుంచి తొలగించినట్లు రియాజ్ ప్రకటించాడు. అతని స్థానంలో అసద్ షఫీఖ్ను తీసుకున్నట్లు వెల్లడించాడు.

ఈ విషయంపై ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన రియాజ్.. 'సల్మాన్ బట్, నాకు మధ్య ఏవేవో ఉన్నాయంటూ చాలా మంది విమర్శలు చేశారు. అందుకే నేను ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నా. దీన్ని బట్కు కూడా ఆల్రెడీ చెప్పాను. నా టీంలో తను ఉండలేడని క్లారిటీ ఇచ్చేశాను కూడా. ఎందుకంటే కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు మాకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ఇస్తున్నారు' అని రియాజ్ అన్నాడు.
'మేం జాకా అష్రాఫ్ నేతృత్వంలో చాలా పారదర్శకంగా పని చేస్తున్నాం. సెలెక్షన్ ప్యానెల్లో ఎవరు ఉండాలో వారిని నేనే ఎంచుకునే అవకాశం కల్పించిన బోర్డు సభ్యులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా' అని రియాజ్ తెలిపాడు. ఈ సెలెక్షన్ ప్యానెల్లో రియాజ్, అసద్ షఫీఖ్తోపాటు కమ్రాన్ అక్మల్, ఇఫ్తికర్ అంజుమ్ ఉన్నట్లు పేర్కొన్నాడు.
ఇలా తను బట్ను ప్యానెల్లోకి తీసుకోవడం వెనుక ఎవరి ఒత్తిడి లేదని చెప్పిన రియాజ్.. 'నాపై ఏం ఒత్తిడి లేదు. భారత్లో కూడా మహమ్మద్ అజారుద్దీన్, అజయ్ జడేజా వంటి వాళ్లు కూడా పదవుల్లో ఉన్నారు. అజారుద్దీన్ ఒక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటే.. జడేజా తాజాగా వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఉన్నాడు' అని గుర్తుచేశాడు