ఒక కొలిక్కి వచ్చిందని అనుకున్న ఆసియా కప్ 2023 వివాదం మళ్లీ మొదటికొచ్చేలా ఉంది. ఈ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా.. ఆ దేశానికి తమ జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంత గింజుకున్నా ఈ విషయంలో వెనక్కు తగ్గడం కుదరదని బీసీసీఐ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేవు కాబట్టి, భారత జట్టును పాక్కు పంపలేమని తేల్చి చెప్పింది.
మిగతా జట్లు అన్నీ వస్తుండగా.. కేవలం భారత్కు సమస్య ఏంటని పాకిస్తాన్ నిలదీసింది. ఏదేమైనా భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టును పంపలేమని, కాబట్టి ఆసియా కప్ టోర్నమెంట్ను తటస్థ వేదికలో నిర్వహించాలని బీసీసీఐ కోరింది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ను అడిగింది. ఇలాంటి సమయంలో పీసీబీ బాధ్యతలు అందుకున్న నజాం సేథీ కొత్త ప్రతిపాదన చేశాడు.

కావాలంటే భారత్ ఆడే మ్యాచులన్నీ వేరే చోట అంటే తటస్థ వేదికలో నిర్వహిస్తామని, మిగతా మ్యాచులు పాక్లోనే ఆడాలని నజాం సేథీ కోరాడు. అతను ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్పై బీసీసీఐ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ చివరకు ఏసీసీ దీనికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే ఆసియా కప్ షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. అంతా అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో పీసీబీ ఇప్పుడు మరో బాంబు పేల్చింది.
పీసీబీ వ్యవహారాలు చూసుకునేందుకు నియమించిన కమిటీ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో ఆ బోర్డు కొత్త చైర్మన్ను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో తను నిలబడటం లేదని నజాం సేథీ చెప్పేశాడు. దీంతో పోటీ పడుతున్న ఏకైక వ్యక్తి జాకా అష్రాఫ్. పీసీబీ చైర్మన్ పదవి అతనికి రావడం దాదాపు లాంఛనమే. ఇప్పుడు అతను ఆసియా కప్ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ టోర్నీ విషయంలో పాకిస్తాన్కు చాలా అన్యాయం జరిగిందని జాకా అష్రాఫ్ అన్నాడు. తాను ఈ హైబ్రీడ్ మోడల్కు అంగీకరించనని తేల్చేశాడు. 'ఏసీసీ రూల్స్ ప్రకారం టోర్నీ మొత్తం పాకిస్తాన్లో జరగాలి. కానీ ఈ హైబ్రీడ్ మోడల్లో కీలకమైన మ్యాచులన్నీ వేరే చోట జరుగుతున్నాయి. కేవలం నేపాల్ వంటి పసికూన దేశాలే పాక్లో ఆడుతున్నాయి. ఇది చాలా అన్యాయం' అన్నాడు.
దీంతో ఆసియా కప్ జరుగుతుందా? అనే చర్చ మొదలైంది. పీసీబీ మంకుపట్టు పడినా టీమిండియా మాత్రం పాక్కు వెళ్లదు. ఈ క్రమంలో ఆసియా కప్ వేదికను మార్చే అవకాశం ఉంది. అదే జరిగితే టోర్నీని బాయ్కాట్ చేయాలని పీసీబీ అనుకుంటోందట. అదే జరిగితే ఆ తర్వాత జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టు భారత్కు రావడం కూడా అనుమానే అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.