టీమిండియా క్రికెట్ చరిత్రలో రికార్డు సృష్టిస్తూ.. తొమ్మిదోసారి ఆసియా కప్ 2025 టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ చారిత్రక విజయం తర్వాత టీమిండియాకు క్రీడా ప్రపంచంలో ఎన్నడూ జరగని విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఏసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందించడానికి నిరాకరించడమే కాకుండా.. దాన్ని తీసుకుని తన హోటల్ గదికి వెళ్లిపోయారు. దీంతో భారత జట్టు ట్రోఫీ లేకుండానే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ వివాదాస్పద, సిగ్గులేని చర్యకు సంబంధించిన తాజా సంచలన వివరాలను ఫైనల్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్న యువ సంచలనం తిలక్ వర్మ, 'బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' కార్యక్రమంలో వెల్లడించారు.
ట్రోఫీ కోసం ఓ గంటపాటు నిరీక్షణ
తమకు ఎదురైన నిరాశను వివరిస్తూ ట్రోఫీ ప్రెజెంటేషన్ కోసం భారత జట్టు ఎంత సమయం ఎదురు చూసిందో తిలక్ వర్మ వెల్లడించారు. "మేము నిజానికి ఓ గంటపాటు మైదానంలోనే ఎదురు చూశాం. టీవీ విజువల్స్లో చూస్తే ఆ సమయంలో నేను అలసిపోయి మైదానంలో పడుకుని ఉండటం కనిపిస్తుంది. మిగిలిన జట్టు సభ్యులు కూడా అలాగే పడుకున్నారు," అని తిలక్ వర్మ ఆ రోజు పరిస్థితిని వివరించారు. అయితే ఆ సమయంలో ఏం జరుగుతోందో ఆటగాళ్లకు తెలియదని తిలక్ స్పష్టం చేశారు. "ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ట్రోఫీ ఇప్పుడే వస్తుందని అనుకుంటూ మేము నిరీక్షించాం. కానీ ఒక గంట గడిచినా ట్రోఫీ మాత్రం ఎక్కడా కనిపించలేదు" అని మొహ్సిన్ నఖ్వీ చర్య గురించి తమకు తర్వాతే తెలిసిందని తిలక్ వర్మ పేర్కొన్నారు.

'నో-ట్రోఫీ'తో ఐకానిక్ సెలబ్రేషన్
ఎంతకీ ట్రోఫీ రాదని స్పష్టమైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా నిరాశ చెందకుండా, తమ విజయాన్ని ప్రత్యేక పద్ధతిలో సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. 2024 టీ20 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ జట్టు చేసిన ఐకానిక్ స్లో-మోషన్ వాక్ తరహాలో ఆసియా కప్ ట్రోఫీ లేకుండానే హాస్యాస్పదంగా వేడుకలు చేసుకున్నారు.ఈ ప్రత్యేకమైన నో-ట్రోఫీ వేడుక ఆలోచన అర్ష్దీప్ సింగ్దే అన తిలక్ వర్మ తెలిపారు. "మనం ఒక మంచి వాతావరణాన్ని సృష్టిద్దాం అని అర్ష్దీప్ అన్నాడు. ట్రోఫీ లేకుండానే 2024 టీ20 ప్రపంచ కప్లో సెలబ్రేట్ చేసుకున్న విధంగానే చేద్దామని చెప్పాడు. "అభిషేక్ శర్మ, నేను, మరో 5-6 మంది దానికి వెంటనే సరే అన్నాం. ఆ తర్వాత మేము ఆ ఐకానిక్ స్టైల్లో సెలబ్రేషన్ను కొనసాగించాం" అని తిలక్ వివరించారు.