హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మికీ ఆర్థర్తో జరిగిన వాగ్వాదంలో ఆ జట్టు ఆటగాడు ఉమర్ అక్మల్దే తప్పుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించిన విచారణ కమిటీ తేల్చి చెప్పింది. ఆగస్టు నెలలో లాహోర్లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉమర్ అక్మల్-మికీ ఆర్థర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ వాగ్వాదంలో ఉమర్ అక్మల్ కోచ్పై నోరు జారడమే కాకుండా, తననే కోచ్ దూషించాడంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దీనిపై హారూన్ రషీద్ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. తాజాగా ఈ కమిటీ తన విచారణలో అక్మల్ను దోషిగా తేల్చింది.
హారూన్ రషీద్ నేతృత్వంలోని కమిటీ తమ విచారణలో భాగంగా ఉమర్తో పాటు అక్కడ ఉన్న మిగతా సభ్యులతో కూడా సమావేశమై వారితో చర్చించింది. అనంతరం ఈ మొత్తం వ్యవహారంలో ఉమర్దే తప్పుగా నిర్ధారించిన కమిటీ.. అతనిపై మూడు మ్యాచ్ల నిషేధంతో పాటు జరిమానా విధించాలని బోర్డుకి సిఫారుసు చేసింది.
ఆటగాడిగా ఉమర్ అక్మల్ బోర్డు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని, దీంతో కొంతకాలం విదేశీ లీగ్లు ఆడేందుకు అతనికి అనుమతి ఇవ్వకూడదని హారూన్ రషీద్ నేతృత్వంలోని విచారణ కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనిపై పీసీబీ చైర్మన్ నజీమ్ సేథీ త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఆరోజు అసలేం జరిగింది?
మోకాలి గాయానికి లండన్లో శస్త్ర చికిత్స చేయించుకున్న అక్మల్ మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు జాతీయ క్రికెట్ అకాడమీకి వచ్చాడు. అయితే కోచ్ అతడికి శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించడంతో వివాదం మొదలైంది. పాక్ క్రికెట్ బోర్డుతో అక్మల్కి ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్ లేకపోవడంతోనే కోచ్, సహాయ సిబ్బంది అతడిని ప్రాక్టీస్కి అనుమతించలేదు.
'అకాడమీలో మొదట ఫిజియోని కలిశాను. అనంతరం సహాయ సిబ్బంది సూచన మేరకు కోచ్ మిక్కీ ఆర్థర్ని స్వయంగా అనుమతి కోసం కలిశాను. అతను మాత్రం.. తాను కేవలం కాంట్రాక్ట్లో ఉన్న ఆటగాళ్లకి మాత్రమే శిక్షణ ఇస్తానని నాకు చెప్పాడు' అని అన్నాడు.
'దీంతో చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్, సహాయ కోచ్ ముస్తాక్లతో నేను మాట్లాడాను. వాళ్లు ఇటీవల నా ఆటతీరు గురించి చర్చించారు. నిజమే నేను గత కొన్ని ఫిటెనెస్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. కానీ ఈ ఇద్దరూ నాకు మరో అవకాశం ఇచ్చే ఉద్దేశంలో వెళ్లి మిక్కీ ఆర్థర్తో మాట్లాడు' అని చెప్పారు. 'నేను రెండో సారి మిక్కీ ఆర్థర్ వద్దకు వెళ్లి విషయం చెప్పగా.. తను సహనం కోల్పోయి అసభ్య పదజాలంతో నన్ను దారుణంగా దూషించాడు' అని అక్మల్ అన్నాడు.