
ఇస్లామాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల కనక వర్షాన్ని కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా టోర్నమెంట్పై పాకిస్తాన్ రగిలిపోతోంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో పాకిస్తాన్ ప్లేయర్లెవరూ ఆడట్లేదు. పైగా ఇక్కcడ ఆడిన అనుభవంతో వేర్వేరు జట్లకు చెందిన ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లల్లో దుమ్ము దులపుతున్నారు. అదే సమయంలో టీమిండియాకు మెరికల్లాంటి ఆటగాళ్లు లభిస్తోన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ను కూడా ఐపీఎల్ శాసించే స్థాయికి చేరుకుంది. ఈ టోర్నమెంట్ కోసం పలు దేశాల క్రికెట్ బోర్డులు.. తమ షెడ్యూళ్లను కూడా వాయిదా వేసుకుంటూ వస్తోన్నాయి. ఐపీఎల్కు లభిస్తోన్న ఆదరణను చూసిన అనంతరం నాలుగైదు దేశాలు.. ఇలాంటి టోర్నమెంట్స్ను నిర్వహిస్తోన్నాయి కూడా. కరేబియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో వెస్టిండీస్, సూపర్ లీగ్ పేరుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇలాంటి మెగా ఈవెంట్లకు రూపకల్పన చేశాయి. అవేవీ ఐపీఎల్కు సాటి రావట్లేదు.
ఐపీఎల్కు లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని దీన్ని మరింత విస్తరించాలనేది బీసీసీఐ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక. రెండున్నర నుంచి మూడు నెలల వరకు దీన్ని నిర్వహించాలని భావిస్తోంది. దీనిపై కసరత్తు సైతం చేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్యను ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోవాలనే నిర్ణయానికి వచ్చింది. దీనికి అవసరమైన ప్రణాళికలను రూపొందించే పనిలో పడింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వద్ద దీనిపై చర్చించేలా చర్యలు తీసుకుంటోంది.
ఆ ప్రతిపాదనలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఐసీసీ నిర్వహించే తదుపరి ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ (ఎఫ్టీపీ) సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తబోతున్నట్లు పీసీబీ చీఫ్ రమీజ్ రాజా స్పష్టం చేశారు. ప్రస్తుతానికి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదని అన్నారు. ఐపీఎల్ విస్తరణ విషయంపై తాను ఇదివరకే బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీతో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. 2021, 2022 ఐపీఎల్ ఫైనల్స్కు హాజరు కావాలంటూ సౌరబ్ గంగూలీ నుంచి తనకు ఆహ్వానం అందిందని, పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తాను వెళ్లలేకపోయానని అన్నారు.