టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్ పై నెలకొన్న సందిగ్ధత మరో మలుపు తిరిగింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్తో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరించాలనే నిర్ణయానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కట్టుబడి ఉన్నారు. భారత ప్రభుత్వం తమ జట్టును పాకిస్థాన్కు పంపేందుకు నిరాకరించిన నేపథ్యంలో, తాము కూడా భారత్తో ఆడే ప్రసక్తి లేదని పాక్ మొండికేస్తోంది. ఈ క్రమంలో మ్యాచ్ ఆడకపోతే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాల భయంతో పీసీబీ వెనక్కి తగ్గి ఐసీసీతో సంప్రదింపులు జరుపుతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ మ్యాచ్ను బహిష్కరిస్తామన్న పాక్ నిర్ణయంపై ఐసీసీతో చర్చలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తాజాగా ఖండించింది.
భారత మీడియాపై పీసీబీ ఫైర్
ఐసీసీతో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చర్చలు జరుపుతున్నారన్న వార్తలను పీసీబీ అధికార ప్రతినిధి ఆమిర్ మీర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రకటన విడుదల చేస్తూ.. భారత మీడియాలో వస్తున్న కథనాలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. "ఐసీసీని మేము సంప్రదించామన్న భారత స్పోర్ట్స్ జర్నలిస్టుల వాదనలో ఎంతమాత్రం నిజం లేదు. భారత మీడియాలోని కొన్ని విభాగాలు కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నాయి. అసలు ఎవరు ఎవరిని సంప్రదించారనేది త్వరలోనే స్పష్టమవుతుంది, అప్పటివరకు వేచి చూడండి" అని ఆమిర్ మీర్ పేర్కొన్నారు.

ఐసీసీ హెచ్చరిక నేపథ్యంలో ఉత్కంఠ
మరోవైపు భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ ఇప్పటికే పాకిస్థాన్ను హెచ్చరించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఐసీసీ ఈవెంట్లలో మ్యాచ్లను బహిష్కరిస్తే పాయింట్ల కోతతో పాటు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. అయినా సరే పాకిస్థాన్ మాత్రం తమ వైఖరిని మార్చుకోకపోవడం గమనార్హం.
బీసీసీఐ మౌనం.. ఐసీసీ ప్రోటోకాల్
ఈ మొత్తం వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటివరకు స్పందించలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటామని బీసీసీఐ స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి 12న పాకిస్థాన్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని మాజీ సెలక్టర్ల అంచనా. ఈ వివాదం కారణంగా ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉందా లేదా ఐసీసీ జోక్యంతో పాక్ వెనక్కి తగ్గుతుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.