Pakistan Cricket Board: అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లో భాగంగా నవంబర్ 17 నుంచి 29 వరకు లాహోర్లో జరగాల్సిన మూడు దేశాల టీ20 టోర్నమెంట్కు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది. రాజకీయ ఉద్రిక్తతలు, తీవ్ర ఆరోపణల మధ్య ఆఫ్ఘనిస్తాన్ జట్టు వైదొలిగినా.. ఈ టోర్నమెంట్ ను ఆపకుండా యథావిధిగా నిర్వహిస్తామని పీసీబీ ధ్రువీకరించింది.
వైదొలగడానికి రాజకీయ కారణాలు
ఈ ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలగడానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) బలమైన కారణాన్ని పేర్కొంది. పాకిస్తాన్ వైమానిక దాడుల కారణంగా తమ దేశంలోని పక్టికా ప్రావిన్స్లో ముగ్గురు క్రికెటర్లు మరణించారని ఆరోపిస్తూ.. దేశంలో నెలకొన్న తీవ్ర రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ పర్యటనకు రావడం లేదని ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయం తీసుకుంది.

పీసీబీ పట్టుదల: ఆపకుంటేనే ఆదాయం!
"ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగినప్పటికీ త్రై-సిరీస్ ప్రణాళికలో ఎటువంటి మార్పు ఉండదు. నవంబర్ 17 నుంచి టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. ఇప్పటికే శ్రీలంకను మూడో జట్టుగా ఖరారు చేశాం. టోర్నమెంట్ కొనసాగడానికి ఇది సరిపోతుంది" అని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు వివరించారు. క్రికెట్ ద్వారా ఆర్థిక ఆదాయాన్ని కొనసాగించాలనే పీసీబీ పట్టుదలకు ఇది నిదర్శనంగా కనిపిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ స్థానంలో ఎవరిని తీసుకుంటారు?
ఈ త్రై-సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ స్థానాన్ని భర్తీ చేయడానికి పీసీబీ అత్యవసరంగా ఇతర క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతోంది. టోర్నమెంట్ స్థాయిని, పోటీని పెంచడానికి పీసీబీ ఇంటర్నేషనల్ క్రికెట్ విభాగం టెస్ట్ హోదా కలిగిన దేశాన్ని ఆహ్వానించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తోంది. ఒకవేళ టెస్ట్ దేశం చివరి నిమిషంలో అందుబాటులోకి రాకపోతే.. నేపాల్, యూఏఈ వంటి అసోసియేట్ సభ్య దేశాలను ప్రత్యామ్నాయ జట్లుగా టోర్నమెంట్లో చేర్చుకోవాలని పరిశీలిస్తున్నారు.
పాకిస్తాన్ క్రికెట్ షెడ్యూల్ బిజీ
ఈ మూడు దేశాల టోర్నమెంట్కు ముందు పాకిస్తాన్ జట్టు శ్రీలంకతో ప్రత్యేకంగా మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక టీ20 సిరీస్ను కూడా ఆడనుంది. ఈ సిరీస్ నవంబర్ 11 నుంచి 15 వరకు జరగనుంది.
ఉద్రిక్తతల్లో పడిన క్రికెట్ బంధం
ఆఫ్ఘనిస్తాన్కు టెస్ట్ హోదా లభించినప్పటి నుంచి పాకిస్తాన్తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడకపోవడం ఇరుదేశాల మధ్య సరిహద్దు, రాజకీయ ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ సంబంధాలు మరింత దిగజారాయి. గతంలో ఆసియా కప్కు ముందు షార్జాలో జరిగిన త్రై-సిరీస్లో అభిమానుల మధ్య ఘర్షణలను నివారించడానికి ఇరు దేశాల ప్రేక్షకులను వేర్వేరు విభాగాల్లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ అభివృద్ధికి పాకిస్తాన్ మద్దతునిచ్చినప్పటికీ,, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇరు దేశాల క్రికెట్ బంధాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. అయినప్పటికీ, క్రికెట్ బోర్డు మాత్రం క్రీడా ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించాలని దృఢంగా ఉంది.