ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూలో బీసీసీఐకి భారీ షేర్ ఇవ్వడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా దీనిపై పీసీబీ అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ ప్రతినిధులతో పీసీబీ నయా చీఫ్ జాకా అష్రాఫ్ సమావేశమయ్యాడు.ఈ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడాడు.
ఈ సమయంలో తాను బీసీసీఐ సెక్రటరీ జై షాను కూడా కలిసినట్లు అష్రాఫ్ వెల్లడించాడు. అలాగే ఐసీసీలో సభ్యత్వం ఉన్న మిగతా దేశాల రెవెన్యూను తగ్గించిన ఐసీసీ.. దాన్ని బీసీసీఐకి ధారాదత్తం చేస్తోందని మండిపడ్డాడు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఆదాయం రెట్టింపు అయినా.. క్రికెట్కు ఉపయోగం లేకపోయిందని చెప్పాడు.

అసలు ఈ రెవెన్యూ విభజన ఎలా చేశారని, ఆ లెక్కలు చెప్పాలని ఐసీసీని జాకా అష్రాఫ్ కోరాడట. అయితే ఇవన్నీ కూడా పీసీబీ మాజీ చీఫ్ నజామ్ సేథీకి తెలుసునని ఐసీసీ చైర్మన్ చెప్పారట. ఇదే విషయాన్ని అష్రాఫ్ వెల్లడించాడు. 'నేను ఇటీవలే ఐసీసీ బోర్డు మెంబర్స్ను కలిశా. ఈ సందర్భంగా జై షాతో కూడా మాట్లాడాను. అంతర్జాతీయ క్రికెట్ను అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పా' అని అష్రాఫ్ అన్నాడు.
'ఇలా అందరూ కలిసి ఉంటేనే మంచిదని సలహా ఇచ్చా. ఈసారి ఐసీసీ రెవెన్యూ షేరింగ్లో పాక్ వాటా రెట్టింపు అయింది. కానీ మిగతా దేశాల వాటాలు తగ్గాయి' అని అష్రాఫ్ అన్నాడు. ఈ విషయంలో ఓటింగ జరగగా తాను కూడా ఓటేశానని చెప్పాడు. ఈ సమయంలోనే అసలు ఈ లెక్కలు ఎలా వేశారో అవి చెప్పలేదని గుర్తుచేశానని, అవన్నీ నజామ్ సేథీకి తెలుసునని ఐసీసీ తెలిపిందట.
తాను ఈ విషయాన్ని సేథీని అడిగానని, అతని వద్ద కూడా ఈ లెక్కలు లేవని అష్రాఫ్ చెప్పాడు. కానీ ఐసీసీ చైర్మన్ మాత్రం రెండుసార్లు ఇదే విషయం చెప్పాడని తెలిపాడు. తాము ఈ లెక్కలకు సేథీకి షేర్ చేశామని స్పష్టం చేశాడట. వాటన్నింటికీ సేథీ అంగీకారం కూడా తెలిపినట్లు ఐసీసీ చైర్మన్ చెప్పాడట.