
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా రాబోయే సంవత్సరంలో చాలా కొత్త ప్రాజెక్ట్లను శుక్రవారం బోర్డ్ మీటింగ్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అతను గత సంవత్సరం బోర్డు ఛైర్మన్ అయినప్పటి నుంచి.. పాకిస్తాన్ జట్టు సాధించిన విజయాల గురించి ప్రస్తావించాడు. అలాగే ప్రపంచ క్రికెట్కు సంబంధించిన చాలా సమస్యలను ఏకరువు పెట్టాడు. అలాగే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీతో కూడా తాను ఐపీఎల్ నిర్వహణ పెంచకూడదనే విషయమై కూడా సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించాడు. ఇకపోతే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ రాజా చెప్పిన విషయాల పట్ల సంతృప్తి చెందలేదు. పీసీబీ ఛైర్మన్గా రమీజ్ రాజా ప్రభావవంతంగా వ్యవహరించడం లేదని అభిప్రాయపడ్డాడు. రమీజ్ రాజా నియామకం తర్వాత పాకిస్థాన్ క్రికెట్లో పరిస్థితులు మెరుగుపడతాయని ఆశించానని, కానీ తనకు నిరాశే మిగిలిందని వాపోయాడు. ఇక తన్వీర్ అహ్మద్ ఇంటర్నేషనల్ క్రికెట్లో పాకిస్థాన్ తరఫున 5 టెస్టులు, 2 వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు.
ఇక తన్వీర్ అహ్మద్ ప్రశ్నిస్తూ.. 'రమీజ్ రాజా పీసీబీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చేసిన ఒక్క మంచి పని నాకు చూపించగలరా? జట్టు ఎంపిక, పీసీబీలో నియామకాల విషయాలు ఇప్పటికీ మెరిట్ ఆధారంగా జరగట్లేవు. రమీజ్ రాజా పీసీబీ ఛైర్మన్గా ఎన్నికైనప్పుడు.. కాస్త పరిస్థితులు మెరుగుపడతాయని నేను అనుకున్నాను. కానీ అది జరగడం లేదు. అతను కూడా తనకు ముందు పనిచేసిన వారి లాగే.. పాక్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేయడం కంటే టైం గడిస్తే చాలు అనేలా వెళ్లదీస్తున్నాడు' అంటూ తన యూట్యూబ్ ఛానల్లో అతను పేర్కొన్నాడు.
ఇకపోతే రమీజ్ రాజా వచ్చే సంవత్సరం నుంచి జూనియర్ పాకిస్థాన్ సూపర్ లీగ్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయమై తన్వీర్ అహ్మద్ స్పందిస్తూ.. 'జూనియర్ పీఎస్ఎల్ని నిర్వహించడానికి బదులుగా.. రెండు రోజులు లేదా మూడు రోజుల టెస్ట్ టోర్నమెంట్లను నిర్వహించడంపై రమీజ్ రాజా దృష్టి పెట్టాలి. ఇలాంటి నిర్ణయాలతో పాకిస్థాన్ క్రికెట్ను రమీజ్ రాజా నాశనం చేయాలని చూస్తున్నాడు. యువ క్రీడాకారులు టెస్ట్ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని, సిక్సర్లు బాదడం నేర్చుకుంటే చాలనేలా తయారవుతారు. అండర్-13 క్రికెట్ ఆడే పిల్లల కుటుంబాలను డబ్బుతో కూడా ఈ నిర్ణయం ప్రభావితం చేస్తుంది' అంటూ తన్వీర్ అహ్మద్ ఆరోపించాడు. టీ20 క్రికెట్ టెస్ట్ క్రికెట్ను నాశనం చేసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఓ పక్క అంటుంటే.. మన ఛైర్మన్ ఏమో జూనియర్ PSL నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ అహ్మద్ దెప్పిపొడిచాడు.