Asia Cup 2025: ఆసియా కప్ 2025లో టీమిండియా పాకిస్తాన్ జట్టుగా వరుసగా మూడో సారి ఓడించింది. లీగ్ దశలో, సూపర్-4లో , చివరికి ఫైనల్లోనూ టీమిండియా చేతిలో పాకిస్తాన్ కు పరాజయం తప్పలేదు. అయితే ఈ విజయం తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తీసుకున్న చర్య ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీకి తలనొప్పిగా మారింది.
మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ తీసుకుని హోటల్కు పరార్!
టీమిండియా మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ పరిణామంతో ఆగ్రహించిన మొహ్సిన్ నఖ్వీ.. ఆసియా కప్ ట్రోఫీని తనతో పాటు హోటల్కు తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్కు ముందే పాకిస్తాన్ జట్టును ఓడించిన తర్వాత పీసీబీ చీఫ్ అయిన మొహ్సిన నఖ్వీ చేతుల మీదుగా భారత ఆటగాళ్లు ట్రోఫీని తీసుకోరని నిర్ణయమైంది. ఈ విషయం తెలిసినా కూడా మొహ్సిన్ నఖ్వీ అవార్డుల వేడుక కోసం దుబాయ్ వచ్చారు. భారత ఆటగాళ్లు ఫైనల్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో.. మొహ్సిన్ నఖ్వీ ఆగ్రహంతో ట్రోఫీని తనతో పాటు హోటల్ కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆయనకు పెద్ద తప్పిదంగా మారే అవకాశం ఉంది.
నఖ్వీ చేసింది పెద్ద పొరపాటు
ఆసియా కప్ నిర్వహణ బాధ్యత పీసీబీది కాదు, పూర్తిగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ది. ఆసియా కప్ ట్రోఫీ పాకిస్తాన్ బోర్డుకు చెందిన జాగీరు కాదు. ఈ ట్రోఫీని ఎవరి చేతుల మీదుగా తీసుకోవాలనేది భారత జట్టు, బీసీసీఐ నిర్ణయం. ఛాంపియన్ హోదాలో ట్రోఫీ భారత జట్టుకు దక్కుతుంది, దీన్ని ఎవరూ ఆపలేరు. మొహ్సిన్ నఖ్వీ చేసిన ఈ చర్యను భారత క్రికెట్ బోర్డు క్షమించదగినదిగా భావించడం లేదు. ఈ ట్రోఫీని హోటల్ కు తీసుకెళ్లినందుకు గానూ బీసీసీఐ త్వరలోనే ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది.
ఈ టోర్నమెంట్లో ఇరు జట్ల ఆటగాళ్లను ఉద్దేశించి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించవద్దని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. ఇటువంటి పక్షపాతపూరిత వైఖరి తర్వాత మొహ్సిన్ నఖ్వీకి భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో కొనసాగే విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. ఆయనను పలు బోర్డు పదవుల నుండి తొలగించే లేదా నిషేధం విధించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.