AAC Chairman Mohsin Naqvi: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త ఛైర్మన్గా ఎన్నికయ్యారు. గురువారం మధ్యాహ్నం సభ్యుల మధ్య ఆన్లైన్ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. మొహ్సిన్ నఖ్వీ రెండేళ్లపాటు ఉంటారు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధిపతి షమ్మీ శిల్వా స్థానంలో నఖ్వీ నియమతులయ్యారు. జైషా పదవీ ముగిసిన అనంతరం షమ్మీ సిల్వాను ఏసీసీ ఛైర్మన్ గా నియమించారు. తాజాగా మొహ్సిన్ నఖ్వీ నియామకమయ్యారు.
2025 ఆసియా కప్ ఈ సారి భారత్ లో జరగాల్సి ఉంది. ఇది సెప్టెంబర్లో జరగనుంది. చివరిసారి టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్లో జరిగింది. నఖ్వీ ముందున్న మొదటి సవాలు ఈ సంవత్సరం జరగనున్న ఆసియా కప్ 2025. భారత్ ఆసియా కప్ ను నిర్వహిస్తున్న నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీ దానిని ఎలా నిర్వహిస్తారోనని ఆసక్తి నెలకొంది.

భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాలు క్షీణించిన కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనడానికి టీమిండియా పాకిస్థాన్ కు వెళ్లలేదు. ఈ క్రమంలో భారత జట్టు తన అన్ని మ్యాచ్ లను దుబాయ్ లో ఆడింది. అటువంటి పరిస్థితిలో ఆసియా కప్ ను కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించవచ్చని లేదా టోర్నమెంట్ ను తటస్థ వేదికలో నిర్వహించవచ్చని తెలుస్తోంది. తటస్థ దేశం ఏది అనేది మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించాల్సి ఉంటుంది. ఆసియా కప్ ఆతిథ్య రేసులో యూఏఈ, శ్రీలంక పేర్లు ముందంజలో ఉన్నాయి.
సెప్టెంబర్లో జరగనున్న ఆసియా కప్
2025 ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకని ఈ నిర్ణయం తీసుకున్నారు. నివేదికల ప్రకారం.. టోర్నమెంట్ సెప్టెంబర్ రెండవ లేదా నాల్గవ వారంలో ప్రారంభం కావచ్చు. ఈ సారి టోర్నమెంట్ లో మొత్తం 19 మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది. చివరిసారిగా ఆసియా కప్ టైటిల్ ను టీమిండియా గెలుచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకను ఓడించింది. అయితే ఈ సారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లేకుండానే టీమిండియా ఈ టోర్నమెంట్ లోకి అడుగుపెట్టనుంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే.