
కరాచీ: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. దాదాపు లక్ష మంది మృత్యువాత పడ్డారు. మహమ్మారి కారణంగా ప్రపంచ క్రీడా క్యాలెండర్ గందరగోళంలో పడింది. ఇప్పటికే ఎన్నో టోర్నీలు రద్దు కాగా.. మరికొన్ని టోర్నీలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఆసియా కప్ 2020 టోర్నీ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్ 2020పై అనిశ్చితి నెలకొంది అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ ఇషాన్ మణి గురువారం ఓ ప్రకటనలో తెలిపాడు.
'ఆసియా కప్ 2020పై అనిశ్చితి నెలకొంది. అయితే టోర్నీ రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. సెప్టెంబరు నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో? ఇప్పుడే చెప్పలేం. నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. అనేక అంశాలపై టోర్నీ జరగడం ఆధారపడి ఉంటుంది. కొన్ని నెలల్లో పరిస్థితులు అదుపులోకి వస్తాయనుకుంటా' అని 'ది టెలిగ్రాఫ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాన్ మణి తెలిపాడు.
ఆసియా కప్ 2020 టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉన్నాయి. పాకిస్థాన్లో టోర్నీ నిర్వహిస్తే.. బీసీసీఐ తమ జట్టును అక్కడికి పంపబోమని ప్రకటించింది. దీంతో తొలుత బీసీసీఐతో మాటల యుద్ధానికి దిగిన పీసీబీ.. ఎట్టకేలకి వెనక్కి తగ్గింది. ఇక యూఏఈ వేదికగా టోర్నీని నిర్వహించేందుకు రెడీ అయ్యింది. సెప్టెంబరులో టోర్నీ నిర్వహించేలా షెడ్యూల్ కూడా ప్రాథమికంగా తయారు చేసింది. అయితే కరోనా కారణంగా ఇప్పుడు టోర్నీ జరగడం సందేహంగా మారింది. సెప్టెంబరులో ఆసియా కప్ 2020 టోర్నీ ఉండగా.. అక్టోబర్ 18 నుండి నవంబర్ 15 వరకు టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ చేయబడింది.
కరోనా కారణంగా ఈ రెండు టోర్నీలు జరగడం అనుమానంగానే ఉంది. అయితే ప్రపంచకప్కు ఇంకా 6 నెలల సమయం ఉందని, షెడ్యూల్ ప్రకారమే టీ20 ప్రపంచకప్ జరుగుతుందని ఐసీసీ భావిస్తోంది. 'టోర్నీ ఆరంభానికి దాదాపు ఇంకా 6 నెలల సమయం ఉంది కాబట్టి అన్నీ సర్దుకుంటాయనే అనుకుంటున్నా. ఒకవేళ పరిస్థితులు కుదురుకోకపోతే ఏం చేయాలనే విషయంపై కూడా ఆలోచిస్తున్నాం. ఐసీసీ, సభ్య దేశాలు, నిర్వాహక కమిటీతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. టిక్కెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మాకు అభిమానుల మద్దతుంది' అని టీ20 ప్రపంచకప్ నిర్వాహక కమిటీ సీఈఓ నిక్ హాక్లీ తెలిపాడు.