పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మళ్లీ ముసలం పుట్టింది. కొన్ని రోజుల క్రితమే పీసీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జాకా అష్రాఫ్ ఈ పదవిలో కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. కొంతకాలం క్రితం పీసీబీ తాత్కాలిక చైర్మన్గా ఉన్న నజాం సేథీ స్థానంలో జాకా అష్రాఫ్ను పాక్ ప్రధాని నియమించిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు అష్రాఫ్ను ఈ పదవి నుంచి తొలగించేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లో రాజకీయ పరిణామాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం కేర్టేకర్ ప్రభుత్వంగా మారింది. అలాగే ఈ దేశంలో ఎన్నికల ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే అష్రాఫ్ను పీసీబీ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తారని సమాచారం.

దేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే.. రాజకీయంగా పదవుల్లో నియమితులైన వారందర్నీ తొలగించాలని పాక్ ఎలక్షన్ కమిషన్ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరిందట. ఇలా నియమితులైన వారిలో అష్రాఫ్ ఒకరు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మాజీ చైర్మన్ నజామ్ సేథీని మరోసారి ఈ పదవిలో కూర్చోబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
గత టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ నిష్క్రమణ తర్వాత.. అప్పటి పీసీబీ చైర్మన్ రమీజ్ రజాపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో అతన్ని పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం కొంతకాలం పాటు నజామ్ సేథీ నేతృత్వంలోని కమిటీ చేతికి ఈ పదవిని అప్పగించింది. ఈ సమయంలోనే పీసీబీ తాత్కాలిక చైర్మన్గా సేథీ బాధ్యతలు నిర్వర్తించాడు.
ప్రస్తుత పరిణామాల గురించి ఒక పాక్ ఇంటర్ పర్సనల్ కోఆర్డినేషన్ శాఖ ఇక చేసిన ప్రకటన ప్రకారం, పాక్ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థనను అనుసరించి రాజకీయ పరంగా పదవులు చేపట్టిన వారిని ఆయా పదవుల నుంచి తొలగించాలి. ఇలా పదవులు చేపట్టిన వారు ఇద్దరు కాగా.. వారిలో జాకా అష్రాఫ్ ఒకడు.