ఆసియాకప్ వాయిదా వేయం:
మహమ్మారి కరోనా తీవ్రత తగ్గితే సెప్టెంబర్-అక్టోబర్లో ఐపీఎల్ నిర్వహిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే సెప్టెంబర్లో దుబాయ్ వేదికగా ఆసియా కప్నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో ఐపీఎల్ లీగ్ కోసం ఆసియా కప్ను వాయిదా వేయమని ఇషాన్ మణి అన్నాడు. 'ఐపీఎల్ టోర్నీపై వస్తున్న ఊహాగానాలు గురించి విన్నాను. ఆసియా కప్ నిర్వహణపై కేవలం భారత్, పాక్ నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. దీనిలో ఇతర దేశాలు కూడా భాగమై ఉన్నాయి. అయితే సెప్టెంబర్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే ఆసియా కప్ నిర్వహించడం ఎంతో ముఖ్యం' అని మణి అన్నాడు.
ఆసియాకప్ ఎంతో కీలకం:
'ఆసియా కప్ నిర్వహించడం ద్వారా వచ్చే నిధులపై ఆసియా క్రికెట్ అభివృద్ధి ఆధారపడి ఉంది. అంతేకాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్య దేశాలకు ఇది ఎంతో కీలకం. వచ్చే రెండేళ్ల వరకు సభ్య దేశాల క్రికెట్ అభివృద్ధికి ఆ నిధులు దోహదపడతాయి. ఇక కరోనా కారణంగా ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగకపోతే దేశాలు ఆర్థికంగా నష్టపోతాయి. మెగాటోర్నీ వాయిదా పడితే ఐసీసీ నుంచి రావాల్సిన నిధులు అందక పాకిస్థాన్తో సహా మిగిలిన దేశాలన్నీ ఇబ్బంది పడతాయి. జూన్ నుంచి వచ్చే జనవరి వరకు ఐసీసీ నుంచి తమ దేశానికి 7-8 మిలియన్ల డాలర్లు రావాల్సి ఉంటుంది, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాకపోవచ్చు. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం' అని మణి పేర్కొన్నాడు.
ఐసీసీ టోర్నమెంట్స్కు ఆతిథ్యం ఇస్తాం:
'2023-31లో ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ ఆసక్తిగా ఉంది. ఐసీసీ పోటీలను నిర్వహించడానికి అంతకుముందు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు అవకాశం దక్కింది. మేము కూడా సిద్దంగానే ఉన్నాం. ఈసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోసం అన్ని దేశాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి' అని పీసీబీ బోర్డు ఛైర్మన్ ఇషాన్ మణి చెప్పుకొచ్చాడు. 2009లో శ్రీలంక క్రికెటర్లపై లాహోర్లో ఉగ్రదాడి తర్వాత ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు గత దశాబ్దకాలంగా ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు కూడా వెళ్లలేదు. దీంతో ఆర్థికంగా ఇప్పటికే చితికిపోయిన పీసీబీ.. ప్రపంచకప్ రద్దయితే మరింతగా ఇబ్బందుల్లో పడనుంది.
కంగారు మొదలైంది:
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ రద్దయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. ఇప్పుడు పాకిస్థాన్లో కంగారు మొదలైంది. కరోనా వైరస్ కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ చివరలో రద్దవడంతో ఆర్థికంగా నష్టపోయిన పాకిస్థాన్ బోర్డు.. టీ20 ప్రపంచకప్ కూడా రద్దయితే కోట్లలో నష్టపోనుంది. సాధారణంగా ప్రపంచకప్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఐసీసీ సభ్య దేశాల క్రికెట్ బోర్డులకి పంచుతుంది.