
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జాతీయ జట్టును ఎంపిక చేసే సెలెక్షన్ కమిటీకి మాజీ సారధి, స్టార్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదీని ఛైర్మన్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26 నుంచి న్యూజిల్యాండ్తో జరిగే టెస్టు సిరీస్ నుంచి ఈ సెలెక్షన్ కమిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని పీసీబీ ప్రకటించింది. అంతకుముందు స్వదేశంలో జరిగిన రెండు టెస్టు సిరీసులను పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ చేతిలో 3-0తో వైట్ వాష్కు గురైంది.
ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ తర్వాత పీసీబీ ఛైర్మన్గా ఉన్న రమీజ్ రజాపై పీసీబీ వేటు వేసింది. అతని స్థానంల్ నజమ్ సేథీ నేతృత్వంలోని 14 మంది బృందానికి ఈ బాధ్యతలు అప్పగించింది. ఇంగ్లండ్ చేతిలో వరుస ఓటములతో పాకిస్తాన్ జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) రేసు నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త సెలెక్షన్ కమిటీని నియమిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. ఈ కమిటీకి ఛైర్మన్గా షాహిద్ అఫ్రిదీని నియమించగా.. అబ్దుల్ రజాక్, రావ్ ఇఫ్తికర్ అంజుమ్ కమిటీ సభ్యులుగా ఉంటారు. హరూన్ రషీద్ ఈ కమిటీకి కన్వీనర్గా సేవలు అందించనున్నాడు.
తనకు ఇంత కీలకమైన బాధ్యత అప్పగించడంపై షాహిద్ అఫ్రిదీ సంతోషం వ్యక్తం చేశాడు.
మెరుగైన పాకిస్తాన్ జట్టును తయారు చేయడానికి తన శక్తి మేరకు ప్రయత్నిస్తానని, మళ్లీ జట్టు విజయాల బాట పట్టేలా చేయడమే తన ముందున్న లక్ష్యమని చెప్పాడు. త్వరలోనే సెలెక్టర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, జట్టు కూర్పుపై తన ఆలోచనలను వారితో పంచుకుంటానని అఫ్రిదీ చెప్పాడు. న్యూజిల్యాండ్తో జరిగే రెండు టెస్టుల సిరీస్లో కూడా పాకిస్తాన్ జట్టు గట్టి పోటీ ఇచ్చేలా చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు. తద్వారా అభిమానులు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందుతామని ధీమా వ్యక్తం చేశాడు.