ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్కు ముందు అందరి చూపూ కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్ మీదనే ఉంది. ఈ ఏడాది ఐపీఎల్లో సూపర్ ఫామ్ కనబరిచిన అతను ఎలా ఆడతాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కోల్కతాతో జరిగిన మ్యాచ్లో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతను.. చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. అయితే రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకోవడం చాలా మంది ఫ్యాన్స్కు నిరాశ మిగిల్చింది. అతని ఆటతీరు చూసిన వాళ్లందరూ కూడా జైస్వాల్కు టీమిండియాలో చోటివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా అదే విషయం చెప్పాడు. జైస్వాల్ను సాధ్యమైనంత త్వరగా భారత జట్టులోకి తీసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇలాంటి నేపథ్యంలో జైస్వాల్ ఆటతీరుపై మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా సన్రైజర్స్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయాన్ని కూడా సెహ్వాగ్ గుర్తుచేశాడు.
జైస్వాల్ అద్భుతమైన బ్యాటర్ అని, అయితే హాఫ్ సెంచరీలను శతకాలుగా మార్చడం మాత్రం అతను కోహ్లీ దగ్గరే నేర్చుకున్నాడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్కు అనుకూలించే ధర్మశాలలో అతను మరింత చెలరేగుతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పోటీలో మూడో స్థానంలో ఉన్న జైస్వాల్.. ఈ సీజన్లో 600 పరుగుల మార్కును దాటేందుకు సిద్ధంగా ఉన్నాడు

ఈ క్రమంలోనే ఒక ప్రముఖ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'యశస్వి జైస్వాల్ కచ్చితంగా ఫ్యూచర్ స్టార్. హాఫ్ సెంచరీలను శతకాలుగా మార్చే కళను అతను కోహ్లీ నుంచి నేర్చుకున్నాడు. చాలా మంది బ్యాటర్లు 13 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేసిన తర్వాత అవుటైపోతారు. కానీ తన ఇన్నింగ్స్ నిర్మించడం ఎలాగో జైస్వాల్ నేర్చుకున్నాడు. భారీ ఇన్నింగ్సులు ఆడే టెంపర్ అతనిలో కనబడుతోంది' అని కొనియాడాడు.