పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్కు సరైన ఆరంభం లభించలేదు. అయినా సరే చివర్లో శామ్ కర్రాన్ (49 నాటౌట్), షారుఖ్ ఖాన్ (43 నాటౌట్) అద్భుతంగా ఆడారు. వీరితోపాటు జితేశ్ శర్మ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పంజాబ్ మంచి స్కోరు చేసింది.
పంజాబ్ చేసిన 187 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో రాజస్థాన్కు సరైన ఓపెనింగ్ లభించలేదు. ఆ టీం స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్లో అతను మరోసారి డకౌట్ అయ్యాడు. ఇది అతనికి వరుసగా మూడో డకౌట్ కావడం గమనార్హం. గత రెండు మ్యాచుల్లో కూడా బట్లర్ డకౌటే అయ్యాడు. అదే సమయంలో యువ ఓపెన్ యశస్వి జైస్వాల్ మరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

జైస్వాల్ (50)తో పాటు మరో కుర్ర ప్లేయర్ దేవదత్ పడిక్కల్ (51) రాణించడంతో రాజస్థాన్ లక్ష్యాన్ని ఛేదించే దిశగా సాగింది. తక్కువ వ్యవధిలోనే వీళ్లిద్దరూ అవుటయ్యారు. అయితే షిమ్రాన్ హెట్మెయర్ (46), రియాన్ పరాగ్ (20) చివర్లో చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో రాజస్థాన్ విజయం దిశగా దూసుకుపోయింది.
చివర్లో కొత్త కుర్రాడు ధృవ్ జురెల్ (10 నాటౌట్) భారీ సిక్సర్తో ఈ ఛేజ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో విజయం సాధించిన రాజస్థాన్ ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసులో మిగిలే ఉంది. గెలిచినా కూడా ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే నెట్ రన్ రేట్ చాలా కీలకంగా ఉంది. ఈ క్రమంలోనే విజయంపై రాజస్థాన్ సారధి సంజూ శాంసన్ స్పందించాడు.
'మ్యాచ్ చివర్లో హెట్మెయర్ అద్భుతంగా ఆడాడు. దీంతో 18.5 ఓవర్లలోనే మేం మ్యాచ్ ముగిస్తామని అనుకున్నా. మాకున్న టీంను చూస్తే.. ప్రస్తుతం మేం ఉన్న పరిస్థితి షాకింగ్గా అనిపిస్తోంది. ఈ సీజన్లో మా ఆటతీరు గమనిస్తే.. మేం చర్చించుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడు. కుర్రాడిలా కాకుండా 100 టీ20ల అనుభవం ఉన్నట్లు ధాటిగా ఆడుతున్నాడు. ఇక బౌల్ట్ తను ఆడిన ప్రతి మ్యాచ్లో తొలి ఓవర్లోనే వికెట్ తీస్తాడు. నేను అదే నమ్ముతా' అని చెప్పాడు.