ఐపీఎల్ 16వ సీజన్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఇప్పుడు అదే జోరులో బలమైన లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. పంజా్లోని ఐఎస్ బింద్రా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. దీని కోసం ఈ స్టేడియంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు జట్ల మధ్య బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో కచ్చితంగా ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గని పంజాబ్ కింగ్స.. ఈసారి శిఖర్ ధవన్ కెప్టెన్సీలో తమ తలరాత మార్చుకోవాలని అనుకుంటోంది. అదే సమయంలో చివరగా 2014లో ట్రోఫీ నెగ్గిన కోల్కతా నైట్ రైడర్స్ కూడా.. పంజాబ్ను ఓడించి కొత్త కెప్టెన్ నితీష్ రాణా సత్తా చూపించాలని అనుకుంటోంది. దేశవాళీల్లో టాప్ కోచ్గా ఉన్న చంద్రకాంత్ పండిట్ కూడా కేకేఆర్ కొత్త కోచ్గా తన శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నాడు.

ఈ మ్యాచ్ జరిగే ఐఎస్ బింద్రా స్టేడియం బ్యాలెన్స్డ్గా ఉంటుందని పేరు. కానీ ఇటీవలి కాలంలో ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. దీంతో పిచ్ బ్యాటర్లకు బాగా సహకారం అందిస్తుందని తెలుస్తోంది. అదే సమయంలో మ్యాచ్ ఆరంభం సమయంలో పేసర్లకు కూడా పిచ్ నుంచి కొంత సహకారం లభిస్తుందట. అలాగే ఇటీవల ఇక్కడ జరిగిన మ్యాచుల ఫలితాలను గమనిస్తే.. ఛేజ్ చేసే జట్టు వీటిలో ఎక్కవ మ్యాచులు గెలిచింది.
ఈ లెక్కన చూసుకుంటే ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ వర్షం పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇక్కడ 80 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా 25 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువే ఉంటుందని సమాచారం. గాలిలో తేమ అయితే 70 శాతం వరకు ఉంటుందట. అంటే సాయంత్రం అయ్యే కొద్దీ మంచు ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ఛేజ్ చేయాలనే ప్రయత్నిస్తుంది.