|
చెలరేగిన సన్రైజర్స్ బౌలర్లు
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఆరంభంలోనే దెబ్బకొట్టారు. దీంతో పంజాబ్ పవర్ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ స్కోర్ 10 పరుగుల వద్ద ఉండగా భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన శిఖర్ ధావన్(8).. మార్కో జాన్సన్కు దొరికిపోయాడు. ఇక ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ప్రభసిమ్రాన్ సింగ్(14)ను నటరాజన్ ఔట్ చేశాడు. దీంతో 33 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. దీంతో సన్రైజర్స్కు పవర్ప్లేలోనే 2 వికెట్లు దక్కాయి.
|
61కే 4 వికెట్లు
ఏడో ఓవర్లో జానీ బెయిర్స్టో (12)ను సుచిత్ ఫెమిలియన్ చేర్చడంతో పంజాబ్ కింగ్స్ 48 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఎనిమిదో ఓవర్లో జితేష్ శర్మ(11)ను ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేశాడు. జితేష్ శర్మ ఇచ్చిన క్యాచ్ను ఉమ్రాన్ మాలికే పట్టుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 8 ఓవర్లలో 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
|
ఆదుకున్న లివింగ్ స్టోన్, షారూక్ ఖాన్
ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ను లివింగ్ స్టోన్, షారూక్ ఖాన్ ఆదుకున్నారు. వీరిద్దరి ఐదో వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరంభం నుంచే లివింగ్ స్టోన్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే 26 బంతుల్లో లివింగ్ స్టోన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 4 ఫోర్లు, 4 సిక్సులతో హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ కెరీర్లో లివింగ్ స్టోన్కు ఇది మూడో హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో లివింగ్ స్టోన్, షారూక్ ఖాన్ ఐదో వికెట్కు 49 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
|
చెలరేగిన భువనేశ్వర్
ఇక 17వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన భువనేశ్వర్ కుమార్ తొలి బంతికే ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. భువి బౌలింగ్లో షారూక్ ఖాన్ ఇచ్చిన క్యాచ్ విలియమ్సన్ పట్టుకోవడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. 28 బంతులు ఎదుర్కొన్న 2 సిక్సులు, ఒక ఫోర్తో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత 19వ ఓవర్లో మరోసారి చెలరేగిన భువనేశ్వర్ ఆ ఓవర్ చివరి బంతికి హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న లివింగ్ స్టోన్ను ఔట్ చేశాడు. లివిగ్ స్టోన్ ఇచ్చిన క్యాచ్ను కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ అందుకున్నాడు. దీంతో 5 ఫోర్లు, 4 సిక్సులతో 33 బంతుల్లో 60 పరుగులు చేసిన లివింగ్ స్టోన్ ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 151 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.
|
ఉమ్రాన్ మాలిక్ విశ్వరూపం
ఇక చివరి ఓవర్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ విశ్వరూపం చూపించాడు. ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా 3 వికెట్లు తీశాడు. అలాగే ఓ రనౌట్ కూడా లభించింది. దీంతో చివరి ఓవర్ మెయిడిన్ కావడంతోపాటు సన్రైజర్స్కు ఏకంగా 4 వికెట్లు దక్కాయి. మొదటి బంతిని డాట్ చేసిన ఉమ్రాన్, రెండో బంతికి ఓడియన్ స్మిత్(13)ను ఫెమిలియన్ చేర్చాడు. మూడో బంతి డాట్ కాగా నాల్గో బంతికి రాహుల్ చాహర్ను, ఐదో బంతికి వైభవ్ అరోరాను క్లీన్ బౌల్డ్ చేశాడు. వీరిద్దరు డకౌట్ అయ్యారు. ఇక చివరి బంతికి అర్ష్దీప్ సింగ్ రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 151 పరుగులకు ఆలౌటైంది. 151 పరుగుల స్కోర్ వద్ద పంజాబ్ 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. సన్రైజర్స్ బౌలర్ల ధాటికి చివరి 4 ఓవర్లలో 19 పరుగులే చేసిన పంజాబ్ ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. సన్రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 4, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో చెలరేగారు. నటరాజన్, సుచిత్ తలో వికెట్ తీశారు. కాగా ఉమ్రాన్ మాలిక్కు (4-28) ఇవే కెరీర్ అత్యుత్తమ గణాంకాలు.