|
ఉమ్రాన్ మాలిక్ విశ్వరూపం
19 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో ఓడియన్ స్మిత్, రబాడ ఉన్నారు. ఇక చివరి ఓవర్ను సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉమ్రాన్ మాలిక్కు ఇచ్చాడు. అయితే ఆ జట్టు చివర్లో కనీసం 10 పరుగులైన సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో ఉమ్రాన్ మాలిక్ ఆ ఓవర్లో ఏకంగా విశ్వరూపమే చూపించాడు.
|
చివరి ఓవర్మెయిడెన్
తొలి బంతిని ఉమ్రాన్ మాలిక్ డాట్ చేయగా రెండో బంతికి ఓడియన్ స్మిత్ను ఔట్ చేశాడు. మూడో బంతి డాట్ కాగా నాల్గో బంతికి రాహుల్ చాహర్ను క్లీన్బౌల్డ్ చేశాడు. ఐదో బంతికి వైభవ్ అరోరాను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఉమ్రాన్ మాలిక్ దెబ్బకు రాహుల్ చాహర్, వైభవ్ అరోరా డకౌట్ అయ్యారు. ఉమ్రాన్ మాలిక్ దూకుడు చూస్తే చివరి బంతికి కూడా వికెట్ తీసి హ్యాట్రిక్ సాధిస్తాడనింపించింది. కానీ చివరి బంతిని అర్ష్దీప్ సింగ్ అడ్డుకోవడంతో ఉమ్రాన్ మాలిక్కు హ్యాట్రిక్ మిస్సయింది. అయితే ఉమ్రాన్కు మిస్సైనప్పటకీ సచిత్, పూరన్ కలిసి అర్ష్దీప్ సింగ్ను రనౌట్ చేశారు. మొత్తానికి ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఉమ్రాన్ మాలిక్ మెయిడెన్ చేశాడు. అలాగే 4 వికెట్లు కూడా దక్కాయి. ఉమ్రాన్ దెబ్బకు అటు పంజాబ్ కింగ్స్ కూడా ఆ ఓవర్లో 151 పరుగులకు ఆలౌటైంది. మొత్తంగా ఈ మ్యాచ్లో 28 పరుగులే ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్ 4 వికెట్లు తీశాడు. అలాగే ఉమ్రాన్ మాలిక్కు ఐపీఎల్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం.
|
నాల్గో ఆటగాడిగా రికార్డు
ఐపీఎల్లో చివరి ఓవర్ను మెయిడెన్ చేసిన నాల్గో బౌలర్గా ఉమ్రాన్ మాలిక్ రికార్డు సృష్టించాడు. ఉమ్రాన్ మాలిక్ కంటే ముందు ఇర్ఫాన్ పఠాన్, జయదేవ్ ఉనద్కత్ సైతం ఈ రికార్డును సాధించారు. 2008లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఇర్ఫాన్ పఠాన్ మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై చివరి ఓవర్ను మెయిడెన్ చేశాడు. 2009లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన లసిత్ మలింగ డెక్కన్ చార్జర్స్తో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్ను మెయిడెన్ చేశాడు. ఇక ఆ తర్వాత 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగిన జయదేవ్ ఉనద్కత్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై చివరి ఓవర్ను మెయిడెన్ చేశాడు. ఇక తాజాగా ఉమ్రాన్ మాలిక్ ఈ ఘనత సాధించాడు. మొత్తంగా ఐపీఎల్లో నలుగురు ఆటగాళ్లు మాత్రమే చివరి ఓవర్ను మెయిడెన్ చేశారు.