ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. వరుసగా రెండు ఓటములతో ఈ సీజన్ను ప్రారంభించిన ఆ జట్టు.. ఇప్పుడు తన మెరుగైన ప్రదర్శనతో వరుసగా రెండో విజయాన్నందుకుంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో 50 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాట్తో బంతితో రాణించి ఆకట్టుకుంది. యశస్వి జైశ్వాల్ (45 బంతుల్లో 67; 3×4, 5×6), రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3×4, 3×6) బ్యాటింగ్ మంచిగా చేశారు. బౌలింగ్లో ఆర్చర్ (3/25), సందీప్ (2/21), తీక్షణ (2/26) పంజాబ్ను దెబ్బతీశారు.
ఫామ్ అందుకున్న జైశ్వాల్..
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచులో యశస్వి జైశ్వాల్ ఫామ్ను అందుకోవడం రాజస్థాన్ కు కలిసొచ్చిన విషయం. ఈ సీజన్ లో తమ జట్టు ఆడిన తొలి మూడు మ్యాచ్ల్లో 1, 29, 4తో పేలవ ప్రదర్శన చేసిన అతడు... ఈ మ్యాచులో మాత్రం 67 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్ (38; 26 బంతుల్లో 6×4)తో కలిసి మంచి శుభారంభాన్నిచ్చాడు. ఇద్దరు కలిసి మొదటి వికెట్కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాటర్లు పర్వాలేదనిపించారు. ఇక ఛేదనలో తడబడిన పంజాబ్ కింగ్స్ 9 వికెట్లకు 155 పరుగులే పరిమితమైంది. నేహాల్ వధేరా (41 బంతుల్లో 62; 4×4, 3×6), మ్యాక్స్వెల్ (21 బంతుల్లో 30; 3×4, 1×6) దమ్ము చాలలేదు.

అలా చేయొద్దు అని చెప్పా...
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడంపై కెప్టెన్ సంజూ శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. "పవర్ప్లే ఆరంభం చూసినప్పుడు స్కోరు కాస్త తక్కువగా అనిపించింది. కానీ ఆ తర్వాత మా నాణ్యమైన బ్యాటర్లు 205 మంచి స్కోర్ చేశారు. వయసులో వారు చిన్నవారైనా, దేశానికి ఎన్నో మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. వాళ్లు గేమ్ను చక్కగా ఆడుతున్నారు. వీరిద్దరిది (సందీప్, ఆర్చర్) డెడ్లీ కాంబో. ఒకడు 150 కి.మి వేగంతో బౌలింగ్ చేస్తే, మరొకడు 115 కి.మి వేగంతో బౌలింగ్ చేస్తాడు. సందీప్ కోసం అయితే ఒక కేక్ కట్ చేయాలి. ఒత్తిడి ఓవర్ల కన్నా వీరినే నేను కాస్త ఎక్కువ నమ్ముతాను. ఇక ఆర్చర్ నాలుగేళ్లుగా గొప్పగా ఆడుతున్నాడు. అతడు ఇప్పుడు భారతదేశంలో వేగంగా బౌలింగ్ చేసే అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. అతడిపై నాకు ఎక్కువ నమ్మకం ఉంది. టైమ్అవుట్ సమయంలో కాసేపు చర్చించాం. వాళ్లలో (పంజాబ్ కింగ్స్) నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు, తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పాను. చివరి బంతి పడే వరకు ఏం జరుగుతుందో చెప్పలేం. ఫలితాల గురించి ఆలోచించకుండా కేవలం ఆటపై దృష్టి పెట్టాం. ఆట ఆటలా ఆడితే ఫలితం సహజంగా వస్తుంది. టీమ్ కాంబినేషన్, బ్యాటింగ్ ఆర్డర్ తో పటు గాయాలపై కూడా దృష్టి పెట్టి ముందుకు సాగాం." అంటూ సంజూ శాంసన్ వివరించాడు.