విరాట్ కోహ్లి (92; 47 బంతుల్లో, 7x4, 6x6) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 242 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 241 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (55; 23 బంతుల్లో, 3x4, 6x6), కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో, 5x4, 1x6) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు (3/38), అరంగేట్ర ప్లేయర్ విద్వాత్ కవెరప్ప (2/36) రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. ఆదిలోనే కెప్టెన్ డుప్లెసిస్ (9; 7 బంతుల్లో, 2x4)ను కవెరప్ప ఔట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన విల్ జాక్స్ (12; 7 బంతుల్లో, 1x4, 1x6)ను కవెరప్ప బోల్తాకొట్టించి బెంగళూరును దెబ్బతీశాడు. కానీ ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రజత్ పటిదార్.. కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.

కోహ్లి, పటిదార్ దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పవర్ప్లేలో ఆర్సీబీ 56 పరుగులు చేసింది. ఆ తర్వాత పటిదార్ టాప్ గేర్లోకి దూసుకెళ్లాడు. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న పటిదార్ను సామ్ కరన్ ఔట్ చేశాడు. అయితే 10 ఓవర్లకు బెంగళూరు 119/3తో ఉన్నప్పుడు వరుణుడి రాకతో మ్యాచ్కు అంతరాయం కలిగింది. కాసేపటికే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను తిరిగి ప్రారంభించారు.
అనంతరం బాదే బాధ్యతను కోహ్లి తీసుకున్నాడు. కామెరూన్ గ్రీన్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత కోహ్లి మరింత చెలరేగాడు. సొగసైన బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లతో అలరించాడు. అయితే శతకం దిశగా సాగుతున్న కోహ్లి అర్షదీప్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారీ షాట్కు యత్నించి 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రొసో చేతికి చిక్కాడు.
ఆఖర్లో దినేశ్ కార్తీక్ (18; 7 బంతుల్లో, 1x4, 1x6)తో కలిసి గ్రీన్ బౌండరీలతో హోరెత్తించాడు. ఆర్సీబీ ఆఖరి అయిదు ఓవర్లలో 77 పరుగులు చేసింది. అయితే చివరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ మూడు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.