ఐపీఎల్-2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన రెండో జట్టుగా ముంబై ఇండియన్స్తో జతకట్టింది. మరోవైపు విజయం సాధించిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
ధర్మశాల వేదికగా జరిగిన ఈ డూ ఆర్ డై మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (92; 47 బంతుల్లో, 7x4, 6x6) సెంచరీ చేజార్చుకున్నాడు. రజత్ పటిదార్ (55; 23 బంతుల్లో, 3x4, 6x6), కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో, 5x4, 1x6) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు (3/38), అరంగేట్ర ప్లేయర్ విద్వాత్ కవెరప్ప (2/36) రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రొసో (61; 27 బంతుల్లో, 9x4, 3x6) టాప్ స్కోరర్. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ (3/43) మూడు వికెట్లు, స్వప్నిల్ సింగ్ (2/28), ఫెర్గూసన్ (2/29), కర్ణ్ శర్మ (2/36) తలో రెండు వికెట్లు తీశారు. అయితే భారీ ఛేదనకు దిగిన పంజాబ్కు ఆదిలోనే షాక్ తగిలింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (6; 4 బంతుల్లో, 1x6)ను స్వప్నిల్ తొలి ఓవర్లోనే పెవిలియన్కు చేర్చాడు.
కానీ వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన రొసో ఇన్నింగ్స్ స్వరూపం మార్చాడు. బెయిర్స్టో (27; 16 బంతుల్లో, 4x4, 1x6)తో కలిసి స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. 4.1 ఓవర్లలో 50 స్కోరు మార్క్ను అందుకున్న పంజాబ్ పవర్ప్లేలో 75 పరుగులు సాధించింది. ఆరో ఓవర్లో బెయిర్స్టో ఔటైనప్పటికీ రొసో బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 21 బంతుల్లో అర్ధశతకం బాదాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న రొసోను కర్ణ్ శర్మ ఔట్ చేశాడు.
10 ఓవర్లకు పంజాబ్ 114/3తో ఛేదనలో గట్టి పోటీనిచ్చింది. కానీ ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పంజాబ్పై ఒత్తిడి పెంచారు. 125/3తో ఉన్న పంజాబ్ 56 పరుగుల వ్యవధిలోనే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. శశాంక్ సింగ్ (37; 19 బంతుల్లో, 4x4, 2x6), సామ్ కరన్ (22; 16 బంతుల్లో, 2x4) పరుగులు చేశారు.
వరుణుడి రాకతో అంతరాయం
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి కూడా శుభారంభం లభించలేదు.డుప్లెసిస్ (9; 7 బంతుల్లో, 2x4), విల్ జాక్స్ (12; 7 బంతుల్లో, 1x4, 1x6) నిరాశపరిచారు. కానీ ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రజత్ పటిదార్తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆది నుంచే దూకుడుగా ఆడిన పటిదార్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 10 ఓవర్లకు బెంగళూరు 119/3తో ఉన్నప్పుడు వరుణుడి రాకతో మ్యాచ్కు అంతరాయం కలిగింది. కాసేపటికే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను తిరిగి ప్రారంభించారు.
రజత్ పటిదార్ ఔటైన అనంరతరం కామెరూన్ గ్రీన్తో కలిసి కోహ్లి బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత కోహ్లి మరింత చెలరేగాడు. సొగసైన బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లతో అలరించాడు. అయితే శతకం దిశగా సాగుతున్న కోహ్లి అర్షదీప్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారీ షాట్కు యత్నించి 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రొసో చేతికి చిక్కాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (18; 7 బంతుల్లో, 1x4, 1x6) బ్యాటు ఝుళిపించాడు. ఆర్సీబీ ఆఖరి అయిదు ఓవర్లలో 77 పరుగులు చేసింది. అయితే చివరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ కేవలం మూడు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.