PBKS VS RCB: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా తాజాగా (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ జరిగిన మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచులో సింహంలా గర్జించిన విరాట్ (73*; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్).. ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
Kohli Most Half centuries IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటి వరకు డేవిడ్ వార్నర్ (66)తో సమంగా ఉన్న విరాట్.. తాజా మ్యాచులో పంజాబ్ పై అర్ధ శతకం బాది, వార్నర్ ను అధిగమించాడు. తన ఖాతాలో 67 హాఫ్ సెంచరీలను వేసుకున్నాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ (53), రోహిత్ శర్మ (45), కేఎల్ రాహుల్ (43) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు
టీ20 క్రికెట్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన క్రికెట్ గా డేవిడ్ వార్నర్ 116తో టాప్ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత క్రిస్ గేల్ (110) తో సమంగా నిలిచాడు కోహ్లీ. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్ అజామ్ (101), జాస్ బట్లర్ (94) ఉన్నారు.
ఆర్సీబీ ఘన విజయం(RCB Won against PBKS)
ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేసింది. దేవ్దత్ పడిక్కల్ (61; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు), విరాట్ కోహ్లీ (73*; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో మెరిశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కాగా, ఆర్సీబీకి ఇది ఐదో విజయం కాగా, ఎనిమిది మ్యాచ్ల్లో పంజాబ్కు ఇది మూడో ఓటమి.