PBKS VS RCB: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా తాజాగా (ఏప్రిల్ 20) జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడిన సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ హోం గ్రౌండ్ ముల్లాన్పూర్ వేదికగా మహారాజా యదవీంద్రా సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచులో దిగ్గజ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ అయింది.
తోక ముడిచిన పంజాబ్ బ్యాటర్లు..
ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. కానీ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు తోక ముడిసింది. ఆశించినంత స్థాయిలో భారీ స్కోరు చేయలేకపోయింది. మొదట ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య 22, ప్రభ్సిమ్రన్ సింగ్ 33, మంచిగానే రాణించినా ఆ తర్వాత బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఆఖర్లో శశాంక్ సింగ్ (31), మార్కో జాన్సన్ (25) కాసేపు బ్యాటు ఝళిపించడంతో 157 పరుగులు చేశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6), జోస్ ఇంగ్లిస్ (29), నేహల్ వధేరా (5), స్టోయినిస్ (1) విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా (2/26), సుయాశ్ శర్మ (2/26) వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ (1/18) వికెట్ దక్కించుకున్నాడు.

రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభ్సిమ్రన్ సింగ్..
అయితే ఈ మ్యాచ్లో 33 పరుగులతో రాణించిన పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్.. యువరాజ్ సింగ్ సాధించిన ఓ రికార్డును బ్రేక్ చేశాడు. గతంలో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్.. ఆ జట్టు తరఫున 959 పరుగులను 51 మ్యాచ్ల్లో చేశాడు. ఇప్పుడు ప్రభ్సిమ్రన్ సింగ్.. 42 మ్యాచ్ల్లోనే ఈ మార్క్ ను దాటాడు. 965 పరుగులు సాధించాడు. సగటు, స్ట్రైక్రేట్లోనూ ప్రభ్సిమ్రన్ (22.97, 150.55).. యువరాజ్ ను (22.30, 127.86) దాటాడు.
పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు..
ఐపీఎల్లో పంజాబ్ ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ (2548) టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత షాన్ మార్ష్ (2477), డేవిడ్ మిల్లర్ (1974), మయాంక్ అగర్వాల్ (1513), మ్యాక్స్వెల్ (1424), క్రిస్ గేల్ (1339), వృద్దిమాన్ సాహా (1190), మనన్ వోహ్రా (1106), మన్దీప్ సింగ్ (1073), కుమార సంగక్కర (1009), శిఖర్ ధవన్ (985) స్థానం సంపాదించుకున్నారు. 12వ స్థానంలో ప్రభ్సిమ్రన్ సింగ్ కొనసాగుతున్నాడు.