చండీగఢ్: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై మరో అద్భుత విజయాన్ని అందుకుంది. 200లకు పైగా టార్గెట్ను ఊది అవతల పడేసింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఇంకో ఏడుబంతులు మిగిలివుండగానే ఛేదించింది. వరుసగా ముంబై ఇండియన్స్ సాధించిన రెండో గెలుపు ఇది. శనివారం తన తదుపరి మ్యాచ్ను ఆడనుంది ముంబై. చెన్నై సూపర్ కింగ్స్ను ఢీ కొట్టనుంది.
బుధవారం రాత్రి మొహాలీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లియామ్ లివింగ్స్టొన్ విధ్వంసం సృష్టించాడు. 42 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. మరో ఎండ్లో జితేష్ శర్మ అదే తరహాలో సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. 27 బంతుల్లో రెండు సిక్సర్లు అయిదు ఫోర్లతో 49 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.

ఫలితంగా పంజాబ్ కింగ్స్ 213 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ముందు ఉంచింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై- ఈ లక్ష్యాన్ని కొట్టి పడేసింది. 18.5 ఓవర్లల్లోనే 214 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, హైదరాబాదీ తిలక్ వర్మ.. మొహాలీ స్టేడియంలో పరుగుల వరద పారించారు. డకౌట్తో రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ- యంగ్ క్రికెటర్లు విజృంభించి ఆడారు.
పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడాడు. హయ్యెస్ట్ రన్ ఛేజ్లో నలుగురే కీలక పాత్ర పోషించారని, వారు క్రీజ్లో ఉన్నంత వరకూ గెలుపుపై అనుమానాలు అక్కర్లేదని పేర్కొన్నాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బ్రిలియంట్ బ్యాటింగ్కు టిమ్ డేవిడ్, తిలక్ వర్మ దూకుడు తోడైందని- దాని ఫలితంగానే 213 పరుగుల లక్ష్యాన్ని తాము ఛేదించగలిగామని చెప్పాడు.
టీ20 ఫార్మట్ క్రికెట్ ఆరంభమైన కొత్తలో 140-150ను విన్నింగ్ స్కోర్గా భావించే వాళ్లమని, ఇప్పుడు 200 దాటినా గెలుపుపై గ్యారంటీ ఉండట్లేదని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో ఒక్కో జట్టు సాధిస్తోన్న బ్యాటింగ్ సగటు 180గా నమోదవుతోండటమే దీనికి నిదర్శనమని అన్నాడు. క్రీజ్లో ఉన్నంత సేపూ ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడాల్సి ఉంటుందని సీజన్ ప్రారంభానికి ముందే జట్టుకు సూచించానని చెప్పుకొచ్చాడు.
పంజాబ్ కింగ్స్ తమకు 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడూ ప్లేయర్లకు ఇదే విషయాన్ని గుర్తు చేశానని, ప్లేయర్లు దాన్ని పకడ్బందీగా అమలు చేశారని కితాబిచ్చాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ తీరు తనను ఆకట్టుకుందని, ఇదివరకెప్పుడూ ఆడని షాట్లను కొట్టాడని రోహిత్ చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ బ్రిలియంట్ బ్యాటర్ అని, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ బెస్ట్ ఫినిషర్స్ అంటూ ప్రశంసించాడు.