Digvesh Singh: ఐపీఎల్లో లక్నో పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ విఫలమైన ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ పై కూడా తీవ్రంగా విమర్శలు ఎదురౌతున్నాయి. ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కూడా ఆటగాళ్ల ప్రదర్శన తీరుతో తీవ్రంగా ట్రోల్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఓటమి బాధలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కు మరో షాక్ తగిలింది!
అదేంటంటే..
లక్నో జట్టులోని స్పిన్నర్ దిగ్వేశ్ రాఠి తీరు.. లక్నోకు తగిలిన షాక్ కు కారణమైంది! అతడు ఛేదనలో మూడో ఓవర్ లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేసిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. కెస్రిక్ విలియమ్స్ తరహాలో సంతకం సంబరాలు చేసుకున్నాడు. ప్రియాంశ్ దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి మరీ చేతిమీద సంతకం చేసి చూపించాడు. అప్పుడు దిగ్వేశ్ను ఫీల్డ్ అంపైర్ కూడా మందలించాడు.

ఈ కారణంగానే ఐపీఎల్ నిర్వాహకులు... దిగ్వేశ్ పై జరిమానా విధించినట్లు తెలిసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేసినట్లు అధికారికంగా తెలిపింది. అలానే ఓ డీమెరిట్ పాయింట్ కూడా విధించినట్లు పేర్కొంది.
"ఆర్టికల్ 2.5 కింద దిగ్వేశ్ లెవల్ 1 అఫెన్స్ కు పాల్పడ్డాడు. ఆ తర్వాత తన తప్పును ఒప్పుకున్నాడు. ఈ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు అతడికి జరిమానా విధిస్తున్నాం. మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్." అంటూ రాసుకొచ్చింది. కాగా, దిగ్వేశ్ - ప్రియాంశ్ గత సీజన్లో దిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒకే జట్టుకు ఆడటం గమనార్హం. వీరిద్దరు స్నేహితులు కూడా!