మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్లో భాగంగా రెండో మ్యాచ్ ఆరంభమైంది. పంజాబ్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్.. తన హోమ్ పిచ్పై తడబడుతోంది. ఇన్నింగ్ ను దూకుడుగా ప్రారంభించినప్పటికీ- ప్రారంభంలోనే వికెట్ కోల్పోయింది.
ఇన్నింగ్ రెండో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ అవుట్ అయ్యాడు. పేస్ బౌలర్ టిమ్ సౌథీ అతన్ని పెవిలియన్ దారి పట్టించాడు. అప్పటివరకు దూకుడుగా ఆడిన ప్రభ్సిమ్రన్.. టిమ్ సౌథీ సంధించిన గుడ్ లెంగ్త్ బంతిని ఫ్లిక్ చేయబోయి టైమింగ్ మిస్ అయ్యాడు. ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి రహ్మనుల్లా గుర్బాజ్ చేతుల్లో వాలింది. అప్పటికి పంజాబ్ కింగ్స్ జట్టు స్కోరు 23 పరుగులు. రెండు ఓవర్లల్లోనే ఈ స్కోర్ సాధించిందా టీమ్.

క్రీజ్లో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు ప్రభ్సిమ్రన్. 12 బంతుల్లో 23 పరుగులు బాదాడు. ఇందులో రెండు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. సౌథీ బౌలింగ్ లోనే రెండు సార్లు బంతిని బౌండరీ లైన్ దాటించాడు. అయిదో బంతికి సిక్సర్ సాధించాడు. ప్రస్తుతం భానుక రాజపక్స, ఓపెనర్ కమ్ కేప్టెన్ శిఖర్ ధావన్ క్రీజ్ లో ఉన్నారు. పంజాబ్ కింగ్స్ తరఫున స్టార్ బ్యాటర్ ఈ సీజన్ లో ఎంట్రీ ఇచ్చాడు. జింబాబ్వే క్రికెటర్ సికందర్ రజా తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.
ఆల్రౌండర్ కింద అతన్ని తుదిజట్టులోకి తీసుకుంది పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్. గత ఏడాది జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ లో సికందర్ రజా ఆల్రౌండ్ ప్రతిభను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఆ ఏడాదిలో 500లకు పైగా పరుగులు, 25 వికెట్లను పడగొట్టిన ఏకైక ప్లేయర్ అతనే. మొత్తంగా ఆ ఏడాదిలో 24 మ్యాచ్లల్లో 23 ఇన్నింగ్లను ఆడిన రజా 35 సగటుతో 735 పరుగులు చేశాడు.