
ఢిల్లీ: పంజాబ్ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్ మయాంక్ అగర్వాల్పై టీమిండియా మాజీ సారథి సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచులో మయాంక్ ఆడిన పుల్షాట్లు ఆకట్టుకున్నాయన్నారు. ఈ సీజన్లో ఢిల్లీ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ముందు నుంచీ ఫామ్ కనబరుస్తున్నాడని పేరొన్నారు. నేటితరం క్రికెటర్లు షార్ట్ పిచ్ బంతుల్ని అలవోకగా సిక్సర్లుగా మలుస్తున్నారని సన్నీ వెల్లడించారు. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అగర్వాల్ (58 బంతుల్లో 99 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీ కోల్పోగా.. గబ్బర్ (69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'ఢిల్లీపై మయాంక్ అగర్వాల్ ఆఫ్సైడ్ అద్భుతంగా ఆడాడు. అదే అతడి బలం. కానీ బంతి షార్ట్పిచ్లో పడిన ప్రతిసారీ అతడు ఫ్రంట్ఫుట్తో పుల్ చేశాడు. ఇలా చేయడంలో రోహిత్ శర్మ అత్యుత్తమ ఆటగాడు. ప్రస్తుతం భారత యువ ఆటగాళ్లూ అతడినే అనుసరిస్తున్నారు. అందుకే ఇప్పటి భారతీయులకు షార్ట్పిచ్ బంతులేయడం సులభం కాదు. గతంలో సింగిల్ లేదా వదిలేసేవారు. ఇప్పుడేం చేస్తున్నారో చూడండి. ఇక మయాంక్ ఆడిన అన్ని షాట్లూ నాకు నచ్చాయి. ఆఫ్డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్ ఇంకా అతనాడిన పుల్ షాట్లు ఊపిరి బిగపట్టేలా చేశాయి' అని అన్నారు.
'సీజన్ ఆరంభం నుంచీ శిఖర్ ధావన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. గబ్బర్ ఏదీ తేలిగ్గా తీసుకోవడం లేదు. కొన్నిసార్లు మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ ఇష్టం వచ్చినట్లు ఆడుతుంటారు. ఇదో చెడ్డ అలవాటు. ధావన్ మాత్రం అలా ఆడడం లేదు. అతడి షాట్లను ఓసారి చూడండి. పరుగులు వచ్చే షాట్లే ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఆడే షాట్లే బాదుతున్నాడు. వాటికి ఫలితమూ కనిపిస్తోంది. చూస్తుంటే అతడు ఢిల్లీకి ఆడటం మరింత ఆస్వాదిస్తున్నాడేమో' అని సన్నీ పేర్కొన్నారు.
ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన రెండో మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. కొత్త కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (58 బంతుల్లో 99 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీ కోల్పోగా.. ఢిల్లీ బౌలర్లలో రబడ మూడు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ధావన్ (69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), పృథ్వీ షా (39) రాణించారు. మయాంక్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.